శ్రీకాకుళం జిల్లాకు చెందిన డాక్టర్ గుండబాల మోహన్ 2021 సంవత్సరానికి ఉగాది పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్ లోని సారస్వత పరిషత్ హాల్ ప్రాంగణంలో జరిగిన సభలో ఆయనకు కేంద్ర మాజీ మంత్రి, డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి ఈ అవార్డును అందచేశారు.
క్రీడా రంగానికి చేసిన సేవలకు గాను జాతీయ స్థాయి ఉగాది పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందని గుండబాలమోహన్ తెలిపారు. జాతీయ స్థాయి ప్రతిభ , కళలు ( ఆర్ట్స్) అసోసియేషన్ వారు ఈ పురస్కారం అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కత్తిమండ ప్రతాప్, డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు తదితరులు కూడా పాల్గొన్నారు. గుండబాల మోహన్ గత 15 సంవత్సరాల నుంచి వ్యాయామ విద్య వృత్తి లో ఉన్నారు. ఉపాధ్యాయ శిక్షణా కళాశాలలో వ్యాయామ అధ్యాపకుడుగా, ఇంజనీరింగ్ కళాశాలలో వ్యాయామ విద్య ఆచార్యునిగా కూడా ఆయన పని చేశారు.
2013 సంవత్సరం నుంచి స్థానిక శ్రీకాకుళం గ్రామీణ మండలంలోని గల పెద్దపాడు ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు గా పని చేస్తున్నారు. ఆయన వద్ద ఇప్పటికే పలువురు విద్యార్థులు శిక్షణ పొంది జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, కుస్తీ పోటీలో పాల్గొని వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని పలు విజయాలు సాధించారు.
తనను ఈ జాతీయ స్థాయి ఉగాది పురస్కారానికి ఎంపిక చేసిన సీ. సీ. టీవీ అధ్యక్షుడైన డాక్టర్ ఆరవెల్లి నరేంద్ర కు కృతజ్ఞతలు తెలిపారు.