కేంద్ర ప్రభుత్వ కార్మిక,రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగష్టు 9న పట్టణ ,జిల్లా కేంద్రాలలో జరిగే నిరసనలు, రాస్తారాకోలు,పికెటింగ్ లు జయప్రదం చేయాలని సిఐటియు పిలుపునిచ్చింది.
రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు జిల్లా అధ్యక్షులు ఆర్.సురేష్ బాబు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.మోహనరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఈశ్వరమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.సింహాచలం కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోలాకి ప్రసాద్ నేడు జరిగిన సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు.
“సేవ్ ఇండియా – సేవ్ వర్కింగ్ క్లాస్ – సేవ్ పీపుల్ నినాదంతో ఆగస్టు 9న క్విట్ ఇండియా డే నాడు దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు, పికెటింగ్ లు నిర్వహించాలని సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు, కౌలు రైతు సంఘాల ఆలిండియా కమిటీలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా సిఐటియు కార్యాలయంలో శనివారం వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేసారు. కట్టడి చేయలేని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ లపై విపరీతంగా పన్నులు వేస్తూ ధరలు పెంచి సామాన్యులను విపరీతంగా దోచుకుంటున్నదని విమర్శించారు. కీలకమైన రైల్వే,విద్యుత్, బొగ్గు, బ్యాంకింగ్, ఇన్సురెన్సు, టెలికాం, రక్షణ రంగం, అంతరిక్షం వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరిస్తూ లూటీ చేస్తుందని ఆరోపించారు.
కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు
బిజేపి ప్రభుత్వం కార్మికుల హక్కులను కాల రాసి యాజమాన్యాలకు బానిసలుగా మార్చిందని విమర్శించారు. స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నదని విమర్శించారు. దేశమంతా కరోనాతో అల్లాడుతుంటే రైతులను అగ్ని గుండంలోకి నెట్టడానికి దొంగ చాటున వ్యవసాయాన్ని రైతుల చేతుల నుండి గుంజుకొని కార్పొరేట్ కంపెనీల కబంధ హస్తాల్లో పెడుతూ మూడు ఆర్డినెన్స్ లు జారీ చేసిందని అన్నారు.
వలస కార్మికులను అనాధలుగా మార్చి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షోభ సమయంలో ప్రజలను ఆదుకోవల్సిన ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు భారీ రాయితీలిస్తూ ప్రజా సంపదను మరింతగా దోచి పెడుతున్నదని విమర్శించారు. నిత్యావసర సరుకుల చట్టానికి సవరణలు చేసి బియ్యం, పప్పులు, వంటనూనెలు, పంచధార, కూరగాయలు నిత్యావసరాలు నుండి మోడి ప్రభుత్వం తొలగించిందని, బడా వ్యాపారులు ఎంత నిల్వలైన పెట్టుకోవచ్చిని దీని వలన కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచేస్తారని అన్నారు.
మధ్య తరగతి ప్రజలపై మరింత భారం
పేదలే కాకుండా మధ్యతరగతి ప్రజలు కూడా నిత్యావసర వస్తువులు కొనుక్కోలేరని అన్నారు. కార్మికుల వేతనాలు, పేద రైతుల ఆదాయాలను పెంచటానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ప్రపంచంలో మన దేశ రైల్వే అతిపెద్ద రైల్వే అని అన్నారు. కీలకమైన ప్రభుత్వరంగ సంస్థలు ప్రయివేటీకరణ దేశ స్వావలంబనకు ప్రమాదకరమని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేటీకరణ వెంటనే విరమించాలని డిమాండ్ చేశారు.
కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన 20లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలో పేదలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. లాక్ డౌన్ కాలానికి కార్మికులకు పూర్తిస్థాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మనిషికి నెలకు 10కిలోల బియ్యం, పప్పులు, నూనె 6నెలలు పాటు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆదాయ పన్ను పరిధిలోకి రాని కుటుంబాలకు 6నెలలు పాటు నెలకు రూ. 7,500/- చొప్పున సహాయం చేయాలని నిత్యావసర వస్తువులు అందించాలని డిమాండ్ చేశారు. అందరికీ ఉచిత ఆరోగ్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.