విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో వర్శిటీ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహిస్తున్న అఖిల భారత ఇంటర్ యూనివర్సిటీ సాఫ్ట్బాల్ పురుషుల విభాగ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభ వేడుకకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన 97 టీమ్ లు మొత్తం 93 మ్యాచ్ లలో నాక్ అవుట్ దశలో పోటీ పడి నాలుగు టీమ్ లు లీగ్ దశకు చేరుకుంటాయి.
తొలిరోజు 30 మ్యాచ్ లు జరగ్గా ఐదు రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరగనుంది. ఈ సందర్భంగా వర్శిటీ ఉపకులపతి అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన మహిళల సాఫ్ట్బాల్ టోర్నమెంట్ అద్భుతంగా ముగిసిందని, దేశం నలుమూలల నుండి వచ్చిన క్రీడాకారులు ఈ క్యాంపస్లో తమ ప్రతిభను నిరూపించడం గర్వకారణం అని అన్నారు. వారు చూపిన ఆటతీరు, క్రమశిక్షణ, స్పోర్ట్స్మన్షిప్ ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచాయని, ఇప్పుడు పురుషుల టోర్నమెంట్కు శ్రీకారం చుడుతున్న తరుణంలో, అదే శ్రద్ధతో, అదే ప్రతిభతో జట్లు ఆడాలని ఆశిస్తున్నానన్నారు.
క్రీడలు కేవలం గెలుపో ఓటమో కాదని, అవి వ్యక్తిత్వ వికాసానికి పునాదులని, ఈ పోటీలు విద్యార్థుల్లో ప్రామాణికత, నాయకత్వం, జట్టు సామరస్యం వంటి మౌలిక విలువలను పెంపొందిస్తాయని అన్నారు. ఇటువంటి జాతీయ స్థాయి పోటీల నిర్వహణ ద్వారా నెల్లూరు జిల్లాకు దేశ క్రీడా పటంలో ప్రత్యేక స్థానం దక్కుతుందని ఆయన ఆశించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ఛైర్మన్ అనిమిని రవి నాయుడు మాట్లాడుతూ ఈ తరహా టోర్నీలు రాష్ట్ర యువతకు అవకాశాలు కల్పించడమే కాకుండా వారి సామర్థ్యాన్ని దేశానికి చూపించే వేదికలని అన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడల రంగంలో విస్తృత ప్రణాళికలతో ముందుకెళ్తోందని, రాష్ట్రానికి ప్రతిష్ట తీసుకొచ్చే క్రీడాకారులను తయారు చేయడమే తమ లక్ష్యం అని అన్నారు. ఈ పోటీలో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నానని ఆయన అన్నారు. ఈ క్రీడా పోటీలు వర్శిటీ ఇన్ ఛార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత, వర్శిటీ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, వివిధ యూనివర్శిటీల కోచ్ లు, అంపైర్ లు, రిఫరీల పర్యవేక్షణలో జరుగుతున్నాయి.