తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అక్టోబరు 7 నుంచి 15వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. కోవిడ్ వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 2.30 నుండి 4 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.
అదేవిధంగా రాత్రి 7 నుండి 8 గంటల వరకు ఆలయ ప్రాంగణంలోనే ఊంజల్సేవ నిర్వహిస్తారు. అక్టోబరు 15వ తేదీనాడు ఆలయంలో గజ వాహనంపై అమ్మవారిని వేంచేపు చేసి ఆస్థానం చేపడతారు. ఈ ఉత్సవాల కారణంగా అన్ని ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది.