బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతుల అభివృద్దికి పాటుపడకపోగా వ్యవసాయ రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకొచ్చిన నేపధ్యంలో కేంద్రప్రభుత్వం రైతులపట్ల తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 27న అఖిలపక్షం భారత్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో నవతరంపార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు బంద్ కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని నవతరం పార్టీ నరసరావుపేట పార్లమెంట్ ఇన్ ఛార్జ్ డా॥గోదా రమేష్ కుమార్ తెలిపారు.
తక్షణమే కేంద్రం నల్లచట్టాలను రద్దుచేయాలని దాదాపు 300 రోజులుగా డిల్లీలో రైతులు తెలుపుతున్న దీక్షకు మద్దతుగా గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం నల్లగార్లపాడులోని అంబేద్కర్ నగర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో రమేష్ కుమార్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ కార్పోరేట్ దిగ్గజాలతో చేతులు కలిపి ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ రైతులు కష్టపడి పండించే పంటలకు కేంద్రప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించడంలో పూర్తిగా విఫలమయిందని అన్నారు.
రైతుకు గిట్టుబాటు ధరలేక వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కష్టపడి వ్యవసాయం చేసి పంటపండించే రైతు కుటుంబాలు ఆకలి పస్తులతో జీవితాన్ని గడుపుతున్నారని ఆయన అన్నారు. రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం అభివృద్ది చెందుతుందని రైతులకు వ్యతిరేకంగా బిజెపి తీసుకొచ్చిన నల్లచట్టాలను రద్దు చేయించేందుకు రైతులు డిల్లీలో చేపట్టిన దీక్షకు అన్ని పార్టీలు మద్దతు తెలిపి ఈనెల 27న తలపెట్టిన బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.