ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సలహాదారు పదవిలో ఉన్న నీలం సాహ్నీని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించుకున్నారు.
ప్రస్తుత ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్. రమేష్ కుమార్ ఈ నెల 31న పదవి విరమణ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో కూడిన ప్యానల్ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కార్యాలయానికి పంపించింది.
అందులో నీలం సాహ్నీని గవర్నర్ ఎంపిక చేశారు. 2019 నవంబర్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. కేంద్ర సర్వీసులో ఉన్న ఆమె చాలా కాలం తర్వాత తిరిగి ఏపీకి వచ్చారు.
ఐఏఎస్ అధికారిగా ఆమె తొలి పోస్టింగ్ మచిలీపట్నంలోనే జరిగింది. ఆ తర్వాత మళ్లీ సీఎస్ గా సాహ్ని ఏపీకి వచ్చారు. ఇప్పుడు ఏపీ ఈసీగా సేవలు అందించబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీ తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని నియమితులయి అప్పట్లో ఆమె సరికొత్త ఘనత సాధించారు.
అంతకుముందు సాహ్ని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు.