తెలుగు ప్రపంచ మహాసభల సందర్భంగా తెలుగు భాష ప్రాముఖ్యతను భవిష్యత్ తరాల వారికి తెలియజేసేలా ఏర్పాటుచేసిన తెలుగు తల్లి, ఎమ్మెస్ సుబ్బులక్ష్మి విగ్రహాన్ని, పూర్ణకుంభం కలశాన్ని గరుడ వారధి పనులలో భాగంగా తొలగించి మూల పడేయడం శోచనీయమని కాంగ్రెస్ నేత నవీన్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుపతి ఓవర్ బ్రిడ్జి పై ఉన్న తెలుగు తల్లి,ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పూర్ణకుంభం కలశ విగ్రహాన్ని తొలగించి వ్యర్థ పదార్థాల మధ్య పడేశారని ఒక తెలుగు భాషాభిమాని తన ఆవేదనను వ్యక్తపరుస్తూ నవీన్ కు సమాచారం ఇచ్చారు. దాంతో స్పందించిన నవీన్ శ్రీనివాసం వసతి సముదాయ ప్రహరీ పక్కన మలమూత్రాలు, మూత్రవిసర్జన చేసే స్థలంలో పడి ఉన్న తెలుగుతల్లి, ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి విగ్రహాలను చూసి ఆవేదనతో ఘాటుగా స్పందించారు.
తిరుపతి ముఖద్వారంలో వున్న తెలుగు తల్లి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి విగ్రహంతో పాటు పూర్ణకుంభం ప్రతిమను గరుడ వారధి పనులలో బాగంగా తొలగించిన తరువాత దానిని భద్రపరచవలసిన బాధ్యత వారధి కాంట్రాక్టర్,నగరపాలకసంస్థ, టీటీడి వారిపై వున్నా ఇంత నిర్లక్ష్యంగా పడవేయడం బాధ్యతారాహిత్యం బాధాకరం అన్నారు.
“దేశ భాషలందు తెలుగు లెస్స” అన్నారు శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషకు చిహ్నంగా ఏర్పాటుచేసిన తెలుగుతల్లి విగ్రహం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం అంటే జన్మనిచ్చిన తల్లిని అవమాన పరిచినట్లే అని తెలుగు భాషాభిమానుల ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని కించపరచడమేనని అన్నారు.
తిరుపతిలోని తెలుగు భాషాభిమానులు, కవులు,ప్రజా సంఘాలు,ప్రజా ప్రతినిధులు తెలుగు తల్లి విగ్రహానికి పట్టిన దుస్థితి పై ప్రతి ఒక్కరూ స్పందించాలన్నారు.
టిటిడి,నగరపాలక సంస్థ అధికారులు వెంటనే స్పందించి తెలుగుతల్లి విగ్రహాన్ని భద్రపరిచి గరుడ వారధి పనులు పూర్తయిన తర్వాత తిరిగి నగరంలోని ప్రధాన కూడళ్లలో సముచిత స్థానంలో ఏర్పాటు చేయాలన్నారు.
తెలుగుతల్లి విగ్రహంతో పాటు భారతరత్న,ప్రముఖ గాయకురాలు,టీటీడీ ఆస్థాన విద్వాంసురాలు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి విగ్రహాన్ని కూడా తొలగించి భద్ర పరచకుండా నిర్లక్ష్యంగా వదిలివేయడం శోచనీయం అని నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు.