స్వామీ వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని, కేంద్ర సమాచార ప్రసార శాఖ, రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో వివేకవర్ధని ఆర్ట్స్, కామర్స్, సైన్స్ కళాశాల లో నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్రం రాష్ట్ర సంచాలకులు ప్రమోద్ హింగె ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ లక్ష్యాలను నెరవేర్చే బాధ్యత యువత పైనే ఉందని అన్నారు.
దేశ సాధికారతలో భాగం పంచుకోగోరు యువత ముందుగా తమ అర్హతలను పెంచుకోవటంతో పాటు, సాఫ్ట్ స్కిల్స్ ను అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. నైపుణ్యాలను పెంచుకునేందుకు యువతీ , యువకులు , కృషి చేయాలని, అలాగే వ్యక్తిత్వ వికాసం కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు.
భారతీయ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని పాశ్చాత్య దేశాలకు మొదటిసారి స్వామీ వివేకానంద పరిచయం చేశారని , రామకృష్ణ మఠ్ ప్రతినిధి ప్రొఫెసర్ విశ్వనాద్ అన్నారు. విశ్వగురుగా భారత్ కున్న శక్తి సామర్ద్యాలను విదేశీయులకు పరిచయంచేశారని, యువత తమ శక్తి సామర్ద్యాలను గుర్తించి, సామాజికంగా చైతన్యవంతమైన జీవితాన్ని గడపాలని ఆయన ఉద్భోదించారు. ఉపాధి కల్పనగా విద్యను చూడకూడదని, ప్రమాణాలను, నాణ్యతను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన చెప్పారు.
స్వామీ వివేకానంద 19 వ శతాబ్దంలో చికాగోలో చేసిన ప్రసంగం దేశ నిర్మాణంలో యువత పాత్రను శక్తివంతంగా ఎత్తి చూపిందని ఆయన చెప్పారు. వివేక వర్ధని విద్యా సంస్ధల సంయుక్త కార్యదర్శి అనిల్ రాజేశ్వర్ మాట్లాడుతూ, 1921 లో గాంధీజీ విద్యాసంస్ధను సందర్శించారని చెబుతూ, విద్యారంగంలో విశేష సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో రీజినల్ అవుట్ రీచ్ బ్యూరో సహాయ సంచాలకులు మానస్ కృష్ణ కాంత్ , హరి బాబు , భారత లక్ష్మి, కళాశాల ప్రిన్సిపల్ సురేష్ రెడ్డి, జాతీయ సేవా పధకం ప్రోగ్రాం అధికారి కె.శ్రీనివాసరావుతో పాటు సమాచార శాఖకు చెందిన అధికారులు, విద్యార్థులు, అధ్యాపకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.