తాటి, ఈత చెట్ల నుంచి లభించే ప్రకృతి సిద్ధమైన పానీయం నీరా హైదరాబాద్ నగరవాసులకు అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం నెక్లెస్ రోడ్డులో నిర్మించిన నీరా కేఫ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎక్సైజ్శాఖ అధికారులు ఇటీవల కేఫ్ను సందర్శించి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. దీని కోసం రూ.10 కోట్ల వ్యయంతో నెక్లెస్ రోడ్డులో రెండంతస్తుల భవనాన్ని నిర్మించారు.
నీరాను సురక్షితంగా నిల్వ చేసేందుకు అన్ని రకాల శీతలీకరణ యంత్రాలను ఏర్పాటు చేశారు. పామ్ ప్రొడక్ట్స్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ అసోసియేషన్ (పీఆర్డీఏ) ఆధ్వర్యంలో నీరాతో పాటు అనుబంధ ఉత్పత్తులను కూడా ఇక్కడ తయారు చేస్తారు. స్వచ్ఛతకు నష్టం వాటిల్లకుండా తాటిచెట్ల నుంచి నీరాను సేకరించడం నుంచి శాస్త్రీయమైన పద్ధతిని పాటిస్తున్నట్లు పీఆర్డీఏ వ్యవస్థాపకుడు వి.సత్యగౌడ్ తెలిపారు.
‘వేదామృత్’ పేరుతో స్వచ్ఛమైన నీరా రుచులను నగరాసులకు పరిచయం చేస్తున్నారు. ఈ కేప్ లోనీరాతో పాటు తెలంగాణ వంటకాలన్నీ లభిస్తాయి. ఒకేసారి సుమారు 3 వేల మందికి పైగా సందర్శించేందుకు అనుగుణంగా కేఫ్ను ఏర్పాటు చేశారు. హుస్సేన్సాగర్ తీరంలోని నెక్లెస్ రోడ్డులో నీరా, తెలంగాణ వంటకాలను ఆస్వాదించవచ్చు. భువనగిరి సమీపంలోని నందనం, కడ్తాల్ సమీపంలోని ముద్విన్లో ఏర్పాటు చేసిన తాటివనం ప్రాజెక్టుల నుంచి హైదరాబాద్కు సరఫరా చేయనున్నారు.
తాటి, ఈత చెట్ల నుంచి సేకరించే నీరా నుంచి తయారయ్యే బెల్లం, సిరప్, బుస్ట్ వంటివి కూడా కేఫ్లో విక్రయిస్తారు. నీరాలో పోషకాలు పుష్కలం. ప్రొటీన్, ఐరన్, పొటాషియం, కాల్షియం, విటమిన్ ఏ, బీ–6, బీ–12 వంటివి సమృద్ధిగా లభిస్తాయి. మొత్తం 20 అమైనో ఆసిడ్స్లో 18 అమైనో యాసిడ్స్ నీరా నుంచి లభిస్తాయి. ఈ పానీయం రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తహీనతను నివారిస్తుంది. అన్ని విధాలుగా ఇది ఆరోగ్య ప్రదాయిని.