ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ దూకుడు ముందు తాము నిలబడలేమని అందువల్ల తన మనుషులను స్థానిక ఎన్నికలలో పోటీకి దించడం లేదని తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపి జె సి దివాకర్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ పెట్టవద్దని తాను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడికి కూడా సూచించానని దివాకర్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలోని అన్ని పార్టీ కలిసినా వైసీపీని ఓడించలేవని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక వేళ ప్రతిపక్షాల వారు గెలిచినా డబ్బు, మద్యం పంచారని అరెస్టు చేసే అవకాశం ఉందని జేసీ అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం తాడిపత్రిలో జరగిన ప్రబోధానంద స్వామి ఆశ్రమంపై దాడి కేసును తిరగదోడుతోందని జేసీ వెల్లడించారు. బెయిల్పై విడుదల అయ్యే అవకాశం లేకుండా తమ వారిని జైల్లో పెడుతున్నారని తెలిపారు.
ఈ విషయంలో తాను దొరికితే అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు. ఏ ప్రభుత్వం ఉన్న అధికారులపై ఒత్తిడి ఉండేదని, కానీ ప్రస్తుత జగన్ సర్కార్లో మాత్రం అధికారులపై తీవ్ర ఒత్తిడి ఉందని తెలిపారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మద్యం, డబ్బు పంచినట్లు తేలితే 3ఏళ్లు జైళ్లో ఉంటారని, దీని వల్ల ప్రతిపక్ష నాయకులు ఇబ్బందులు ఎదుర్కొంటారని జేసీ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిసి స్థానిక ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబును కోరినట్లు తెలిపారు. కానీ, చంద్రబాబు ప్రజల్లో మార్పు వచ్చిందని ,వారిపై అంచెంచల విశ్వాసం ఉందని చెబుతున్నారని వెల్లడించారు.