రైతు జీవితాన్ని కార్పొరేట్ల చేతిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఆమోదించిన వ్యవసాయ బిల్లును నిరసిస్తూ ఈనెల 25వ తేదీన వామపక్షాలు, ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చినట్లు సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, పోటు ప్రసాద్, గోకినేపల్లి వెంకటేశ్వర్లు తెలిపారు.
భూమికి చెర…రైతుకు ఉరి లాంటి ఈ బిల్లును కేంద్రం తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లు ఆమోదం కోసం రాజ్యసభలో బీజేపీ వ్యవహరించిన తీరును ఆక్షేపించారు.
ఓటింగ్ అడిగిన సభ్యుల హక్కును కాలరాసి ముజువాణి ఓటుతో పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధంగా మోడీ సర్కారు ఆమోదింపజేసిందని మండిపడ్డారు. 21వ శతాబ్దపు అవసరం కోసం ఈ బిల్లు అని మోడీ ప్రకటించారు.
వాస్తవానికి ఇది కార్పొరేట్ల కోసం తెచ్చిన బిల్లు అన్నారు. రైతును కూలీలుగా.. కార్పొరేట్ కంపెనీలకు కట్టుబానిసలుగా మార్చే బిల్లు ఇది అన్నారు.
ఈ బిల్లు మూలంగా వ్యవసాయ మార్కెట్లు పూర్తిగా రద్దవుతాయన్నారు. స్వెేచ్ఛా మార్కెట్ పేరుతో కార్పొరేట్కు ధారాదత్తం చేసేందుకు కుట్రపన్నుతున్నారన్నారు. మార్కెట్లో నిత్యావసర వస్తువులు, పంట కొరతను సృష్టించి రైతును నట్టేట ముంచే బిల్లు ఇది అని పేర్కొన్నారు.
కఠిక దుకాణంకు మేకను అప్పజెప్పిన చందంగా కార్పొరేట్లకు వ్యవసాయాన్ని కట్టబెట్టేందుకు మోడీ ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రను నిరసిస్తూ వామపక్షాలు, కేంద్రంలో ప్రతిపక్షాలు నిర్వహించే ఈ ఆందోళనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు.
ఈ బిల్లు ప్రమాదాన్ని గుర్తించి భాగస్వామ్య పార్టీ అయిన అకాళీదళ్ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిందన్నారు. ఆ పార్టీకి చెందిన కేంద్రమంత్రి హర్సిమ్రత్ పదవికి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు ఇప్పటికే ఈ బిల్లు పై ఆందోళనలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై స్పందించాలని కోరారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఈ బిల్లును రాష్ట్రపతి వెనక్కు పంపాలని కోరారు. కేంద్ర విద్యుత్ బిల్లు, జీఎస్టీ, వ్యవసాయ బిల్లు ఇలా ఒకదాని వెంట ఒకటి ప్రవేశపెడుతూ కరోనా సమయంలో ప్రజలను మరింత సంక్షోభంలోకి నెట్టేందుకు బీజేపీ సర్కారు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
25వ తేదీన వామపక్షాలు నిర్వహించే ఆందోళనకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ సైతం కలిసి రావాలని కోరారు. రైతుకు తీరని నష్టం చేసే ఈ వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఓటు వేయడాన్ని వామపక్ష నేతలు స్వాగతించారు.
ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని వెంకటేశ్వర్లు, తాతా భాస్కర్రావు, ఎస్కేవిఎ మీరా, సీపీఐ జిల్లా నాయకులు జానీమియా, తాటి వెంకటేశ్వర్లు, బాణోత్ రామకోటి, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్, ఆవుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు