రూ.కోట్లు వెచ్చించి నూతన సెక్రటేరియట్ నిర్మించిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు కొత్త అసెంబ్లీ నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. శాసనసభ, శాసన మండలి భవనాలు ఒకే దగ్గర ఉండాలనే కాన్సెప్ట్తో కొత్త భవనం నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు
తెలిసింది. ఇందు కోసం రాజ్భవన్ పక్కనే ఉన్న ప్రభుత్వ కట్టడాలను కూల్చేసి ఆ ప్రాంతంలో నూతన అసెంబ్లీ నిర్మించాలని ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు సేకరించేందుకు సీఎంవో
అధికారులు కసరత్తు షురూ చేశారు. అంతా అనుకున్నట్టు జరిగితే శ్రావణ మాసంలో ట్విన్ టవర్స్తో పాటే కొత్త అసెంబ్లీ బిల్డింగ్కూ భూమి పూజ చేసే చాన్స్ ఉన్నట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది.హైదరాబాద్లోని రాజ్భవన్ రోడ్డులో ఉన్న దిల్కుష్ గెస్ట్హౌజ్, రాజ్భవన్, నర్సింగ్ కాలేజీ భవనాల చుట్టూ సుమారు 20 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నది.
ప్రస్తుతం దిల్ కుష్ గెస్ట్హౌజ్ను పెద్దగా ఉపయోగించుకోవడం లేదు. నర్సింగ్ కాలేజీ పాతబడిపోయింది. రాజ్ భవన్ ముందున్న లాన్, రాజ్ భవన్ బిల్డింగ్, ఆ పక్కనే ఉన్న గెస్ట్హౌజ్ మినహా మిగతా ప్రాంతమంతా ఖాళీగానే ఉన్నది. ఈ స్థలంలో కొత్త అసెంబ్లీ నిర్మించేందుకు సీఎం కేసీఆర్ మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. అయితే అక్కడ ఇంకా ఏం
నిర్మాణాలున్నాయి? అవి ఏ పరిస్థితులో ఉన్నాయి? అనే వివరాలను సీఎంవో అధికారులు ఆరా తీసే పనిలో పడ్డారు.
ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ అనుకూలంగా లేదనే అభిప్రాయంలో సీఎం కేసీఆర్ ఉన్నారు. మండలి ఒక చోట శాసనసభ మరో చోట ఉండటంతో సమావేశాల టైంలో మంత్రులు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారని గతంలో చాలా సార్లు
కేసీఆర్ కామెంట్ చేశారు. అందుకే కొత్త అసెంబ్లీ భవనం అవసరమనే ఉద్దేశంతో 2019 జూన్ 28న ఎర్రమంజిల్లో కొత్త అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కానీ అక్కడ హెరిటేజ్ బిల్డింగ్ ఉన్నదని, దాన్ని ఎలా కూల్చుతారని
అప్పట్లో వివాదం మొదలైంది. ఆ తర్వాత ఆ బిల్డింగ్కు హెరిటేజ్ హోదాను ప్రభుత్వం తొలగించింది. అక్కడ అసెంబ్లీ నిర్మించడం కంటే రాజ్ భవన్ రోడ్డులో నిర్మిస్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవనే అభిప్రాయంలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తున్నది.
రాజ్భవన్కు అంత స్థలం అవసరమా? రాజ్భవన్ ముందు విశాలమైన స్థలం ఉన్నది. ఆ వెనుకా ఐదారు ఎకరాల విస్తీర్ణంలో ఖాళీ ప్లేస్ ఉన్నది. ఆ స్థలాన్ని ఖాళీగా ఉంచడం వల్ల ఉపయోగం లేదని, అయినా రాజ్ భవన్కు అంత
విశాలమైన స్థలం అవసరమా? అనే అభిప్రాయంలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం ఉన్న రాజ్ భవన్ను అలాగే ఉంచి, బ్యాక్ సైడ్లో ఉన్న ఖాళీ స్థలం, బిల్డింగ్ ఎడమ వైపున ఉన్న దిల్ కుష్ గెస్ట్ హౌజ్, కుడి
వైపున ఉన్న నర్సింగ్ కాలేజీని తొలగించి కొత్త అసెంబ్లీ నిర్మించే యోచనలో సీఎం ఉన్నట్టు అధికార వర్గాలు ధృవీకరిస్తున్నాయి.రాజ్భవన్ వద్ద అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణం అనుకూలంగా ఉంటుందని కేసీఆర్ భావిస్తే ఎన్నికల
షెడ్యూల్ వచ్చేలోపు శ్రావణ మాసంలో భూమి పూజ చేసే చాన్స్ ఉన్నది. దీంతో పాటు హెచ్వోడీల ఆఫీసుల కోసం ట్విన్ టవర్స్ నిర్మాణానికీ భూమి పూజ ఉంటుందని భావిస్తున్నారు. బేగంపేటలోని పాటిగడ్డలో సుమారు 40 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నది. అక్కడ ట్విన్ టవర్స్ నిర్మించేందుకు కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని టాక్ ఉన్నది.