హైకోర్టు ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణం లో నూతన జిల్లా కోర్టు భవన నిర్మాణానికి తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కరీంనగర్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి అనుపమ చక్రవర్తి తెలిపారు. శనివారం ఆమె జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, సంబంధిత అధికారులతో కలిసి నూతన కలెక్టరేట్ భవన సముదాయానికి దగ్గరలో ఉన్న కోర్టు భవన నిర్మాణానికి గుర్తించిన 10 ఎకరాల అనువైన స్థలాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ , ఎస్పీ కార్యాలయాలకు అనుసంధానంగా ఉండేలా సుమారు 10 ఎకరాలలో కోర్టు నిర్మాణానికి ప్రభుత్వం అంగీకరించిందని, కోర్టు భవన నిర్మాణానికి సంబంధించి అవసరమైన ప్రొసీడింగ్స్ పంపవలసిందిగా జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ను కరీంనగర్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి అనుపమ చక్రవర్తి కోరారు.
ఈ స్థలంలో కోర్టు నిర్మించడానికి బార్ అసోసియేషన్ సభ్యులు కూడా ఆమోదం తెలిపారని అన్నారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల పరిధిలో గుర్తించిన స్థలం అనువుగా ఉందని ఆమె సానుకూలత వ్యక్తపరిచారు.
అంతకుముందు స్థల పరిశీలన వచ్చిన కరీంనగర్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి అనుపమ చక్రవర్తి కు జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పూల మొక్కను బహుకరించి స్వాగతం పలికారు. సందర్శనలో ప్రిన్సిపల్ జూనియర్ సబ్ జడ్జి శంకర శ్రీదేవి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంజుల, సిరిసిల్ల ఇంచార్జి సబ్ జడ్జి అహ్మద్ పాషా, ఆర్డీఓ శ్రీనివాస రావు, ల్యాండ్ సర్వే అధికారి శ్రీనివాస్, తహశీల్దార్ అంజన్న తదితరులు పాల్గొన్నారు.