ప్రతి జిల్లాలో రూ.25 కోట్లతో కొత్త పోలీస్ కార్యాలయాల భవన నిర్మాణాలను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా చేపడుతున్నామని తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. నేడు ఆయన నాగర్ కర్నూల్ జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్నజిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించి, నిర్మాణ పనుల తీరును పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా ఇంచార్జి ఎస్పి కే.అపూర్వరావు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో, జిల్లాకో రూ.25 కోట్లతో కొత్తగా పోలీస్ కార్యాలయ భవన నిర్మాణాలు, పోలీస్ శాఖ బలోపేతానికి రూ.375 కోట్లతో కొత్త వాహనాల కొనుగోలుకు కేటాయించామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో పోలీస్ శాఖ పటిష్టంగా పని చేయడం కోసం మొదటగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, డీజీపీతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయాలని, అందుకు కావాల్సిన నిధులను కేటాయించాలని సూచించారని అన్నారు.
దేశంలో ఇతర రాష్ట్రాల పోలీసు శాఖ వారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సందర్శించి ప్రశంసిస్తున్నారని తెలిపారు. అడ్మినిస్ట్రేషన్ అవసరాల కోసం మండల పోలీస్ స్టేషన్ కు నెలకు 25 వేల రూపాయలు, తాలూకా పోలీస్ స్టేషన్ కి 50వేల రూపాయలు, పెద్ద పోలీస్ స్టేషన్లకు 75 వేల రూపాయలను గవర్నమెంట్ అందజేస్తుందని తెలిపారు. మంజూరైన పనులన్నీ ఆన్లైన్ టెండర్ల ద్వారా ఎంపిక చేసి పారదర్శకంగా, నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పూర్తి చేస్తున్నామన్నారు.
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పనులను ఆన్లైన్ టెండర్ల ద్వారానే చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 13 కొత్త జిల్లాల్లో ఎస్పీ కార్యాలయాల భవన నిర్మాణ పనులు, రెండు పోలీస్ కమిషనర్ కార్యాలయాల నిర్మాణ పనులు కూడా అదే స్పీడుతో జరుగనున్నాయన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమనే లక్ష్యంతో ప్రభుత్వం పోలీస్శాఖను బలోపేతం చేయుటకు రూ.375 కోట్లతో కొత్త వాహనాలు కొనుగోలు చేశారని తెలిపారు. దేశంలోనే శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్గా నిలుస్తుందన్నారు. ఈ సమావేశంలో నాగర్ కర్నూల్ జిల్లా ఇంచార్జి ఎస్పి కే.అపూర్వరావు, ఎఅర్ అదనపు ఎస్పి అనోక్ జయకుమార్, డి.ఎస్పిలు మోహన్ రెడ్డి, దీపక్ చంద్ర, సి.ఐ గాంధీ నాయక్, ఇతర పోలీస్ సిబ్బంది, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు.