28.7 C
Hyderabad
April 20, 2024 08: 38 AM
Slider జాతీయం

Analysis: కొత్త రకం కరోనా వైరస్ కథ ఇది

New carona virus

కొత్త రకం కరోనా వైరస్ చుట్టూ ఇప్పుడు ప్రపంచం ఆలోచిస్తోంది. బ్రిటన్ లో బయటపడిన ఈ వైరస్ వల్ల అన్ని దేశాలు అప్రమత్తమవుతున్నాయి. కోవిడ్ -19 నేర్పిన అనుభవంతో ముందు జాగ్రత్త చర్యలు పాటించే పనిలో పడ్డారు. కరోనాకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి, మళ్ళీ ఒకప్పటి సాధారణ పరిస్థితులు వచ్చేస్తున్నాయని అందరూ అనందంగా ఊపిరి పీల్చుకుంటూ పండుగ వేళలకు సిద్ధమవుతున్నవేళ, కొత్త కరోనా వైరస్ వ్యాప్తి వార్త అందరినీ ఆలోచనలో పడేసింది.

కాంటాక్ట్ ట్రేసింగ్ మొద‌లు

మన దేశంలోని విమానాశ్రయాలలోనూ అప్రమత్తం చేశారు. విదేశాల నుండి వచ్చినవారిని క్వారన్టైన్ కు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో, భారత్ -బ్రిటన్ మధ్య విమానాలను ఈ డిసెంబర్ వరకూ నిలుపుదల కూడా చేశారు. ఈ తరుణంలో, కొద్ది రోజుల క్రితమే యుకె నుండి చెన్నైకి వచ్చిన ఒక వ్యక్తికి ఈ మంగళవారం నాడు కరోనా సోకింది. ఆ వ్యక్తి ఢిల్లీ నుండి చెన్నై చేరుకున్నాడు. ఈ పరిణామంతో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాప్తిని కట్టడి చేసేందుకు కాంట్రాక్టు ట్రేసింగ్ ను మొదలుపెట్టారు. అయితే, ఈ వ్యక్తికి సోకింది కొత్త వైరసా? పాతదా? తేలాల్సివుంది. పూణే లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీకి పరీక్ష నిమిత్తం నమూనాను పంపారు.

పూర్తి ఫ‌లితాలు వ‌స్తేగానీ తెలియ‌ని ప‌రిస్థితి

ఇదే క్రమంలో, లండన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ప్రయాణీకుల్లో ఐదుగురికి కోవిడ్ -19పాజిటివ్ అని తేలింది. పరీక్షలు పూర్తయి ఫలితాలు వస్తేకానీ, మిగిలిన వివరాలు తెలియదు. బ్రిటన్ నుండి వచ్చిన వారిలోనే ఈ విధంగా ఉండడం వల్ల, యూకె విషయం భారత్ మరింత అప్రమత్తమైంది. కొత్త రకం వైరస్ ఇటలీకి కూడా పాకింది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని, మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పురపాలక సంఘాల ప్రాంతాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. మన దేశంలోని మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలను చేపట్టానున్నాయో కొన్ని రోజుల్లోనే తెలుస్తుంది. మిగిలిన దేశాలు కూడా ఆంక్షలు విధిస్తున్నాయి.

పండ‌గ సీజ‌న్‌లో మ‌రింత అప్ర‌మ‌త్తం అవ‌స‌రం

ఇది పండుగ సీజన్ కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండడం మంచిదే. అయితే, అదే సమయంలో, ఈ కొత్త రకం వైరస్ గురించి ఇంత బయ భ్రాంతులకు గురికావాల్సిన అవసరం ఉందా? అన్నది ముఖ్యమైన ప్రశ్న. ఈ కొత్త రకం కరోనాను గమనిస్తే, ప్రస్తుతానికి కొన్ని విషయాలు అర్ధమవుతున్నాయి.

పాత వైరస్ కంటే 70శాతం ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతోంది.

దీనివల్ల జలుబు, జ్వరం మొదలైనవి వేగంగా సంభవిస్తున్నాయి.

పాత దానితో పోల్చుకుంటే ఇది ప్రాణంతకమైంది కాదని శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.

కొత్త‌ర‌కం వైర‌స్‌లో శ‌క్తి త‌క్కువేనా?

సహజంగా ప్రతి జీవికి స్వయంగా తనలాంటి మరో జీవిని సృష్టించుకోవాలనే కోరిక ఉంటుంది. అది మనిషి నుండి కంటికి కనిపించని ఇటువంటి జీవి వరకూ ఉంటుంది. ఇది చాలా సహజసిద్ధమైన జీవప్రవృత్తి. అందులో భాగంగానే, కోవిడ్ -19కూడా ఉత్పత్తికి సిద్ధమైంది. ఇలా కొత్తరకంగా పుట్టుకురావడమే మ్యుటేషన్. దాన్నేమార్పులు చెందడం అంటారు. ఈ వైరస్ కు సంబంధించిన మార్పులను గమనిస్తే, మొదట పుట్టిన వైరస్ లో ఉండే శక్తి కంటే దీని శక్తి చాలా తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తల అభిప్రాయం. వ్యాప్తిలో వేగం తప్ప, దీని దుష్ప్రభావం పాత రకాని కంటే ఎంతో తక్కువగా ఉంటుందనీ, మరీ ముఖ్యంగా ఇది ప్రాణాంతకం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఎన్ 501వై ఉత్పరివర్తన కార‌ణం వైరాలాజిస్ట్ ఆచార్య శేషాద్రి వాసన్

కొత్త రకం కరోనా వైరస్ “ఎన్ 501వై” అనే ఉత్పరివర్తన కారణంగా ఉత్పన్నమైందని భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా వైరాలాజిస్ట్ ఆచార్య శేషాద్రి వాసన్ చెబుతున్నారు. దీని వల్ల తీవ్ర అనారోగ్యం కలుగుతుందనడానికి ఇంతవరకూ ఎటువంటి ఆధారాలు లేవని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే తయారై వున్నవ్యాక్సిన్ల సమర్ధత విషయంలో ఎటువంటి అనుమానాలు అవసరం లేదని, ఆయన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. కాకపోతే, ఈ కొత్త రకం వ్యాక్సిన్ సోకుతున్నవారిలో జన్యు క్రమాన్ని ఆవిష్కరించడం ముఖ్యమని పలువురు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

భ‌యాందోళ‌న‌లు వ‌ద్దు.. జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం

ఇదే క్రమంలో, దక్షిణ ఆఫ్రికాలో గుర్తించిన కొత్త రకం వైరస్ యువతలో వేగంగా వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. మొత్తంమీద సారాంశం ఏంటంటే, కొత్త రకం కరోనా వైరస్ గురించి భీభత్సంగా భయాందోళనలకు గురికానక్కర్లేదని పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదే సమయంలో, త్వరలో అందుబాటులోకి రానున్నవ్యాక్సిన్లు ఇటువంటి కొత్త రకాలను అడ్డుకునే శక్తి కలిగి ఉంటాయాని నిపుణులు విశ్వాసాన్నివ్యక్తం చేస్తున్నారు. సరియైన జాగ్రత్తలు తీసుకోవడం, వ్యాధి నిరోధకశక్తిని పెంచుకోవడమే మనకు రక్షణకవచాల‌కు ప్ర‌స్తుతానికి ప‌రిస్థితులు గోచ‌రిస్తున్నాయి.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

బస్తీ దవాఖానతో ప్రతి ఒక్కరికి మేలు

Satyam NEWS

కమల్ హసన్ పై కేసు నమోదు

Satyam NEWS

వనపర్తిలో ముస్లింల సమాధులపై ఇళ్ల ప్లాట్లు

Satyam NEWS

Leave a Comment