జనగామ జిల్లా కలెక్టర్ గా నియమితులైన ఐఏఎస్ అధికారి కె.నిఖిల నేడు బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకూ ఆమె సంగారెడ్డి జిల్లా సంయుక్త కలెక్టర్ గా విధులు నిర్వర్తించారు. నూతన కలెక్టర్ కు సంయుక్త కలెక్టర్ ఓ.జే.మధు, డిఆర్వో మాలతి, పిఆర్వో ప్రేమలత, కలెక్టరేట్ ఏ.ఓ. వీర ప్రకాష్ జిల్లా అధికారులు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నూతన కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ జనగామ జిల్లాను ఉమ్మడి వరంగల్లు జిల్లాతో పోటీ గా అభివృద్ది చేయాలనే సంకల్పంతో జిల్లా అధికారులు పని చేయాలని కోరారు. ప్రభుత్వ పథకాల అమలులో జిల్లా అధికారులందరూ సమయస్పూర్తితో త్వరితగతిన ప్రజలకు అందుబాటులో ఉంటూ పనులు పూర్తి చేయాలని కోరారు. నూతన కలెక్టరేట్ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయించాలని R&B ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ నాగేందర్ రావును కలెక్టర్ ఆదేశించారు.
అలాగే రోడ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను కోరారు. మొట్టమొదటి సమస్యగా గుండాల రైతుల కందుల కొనుగోలు సమస్యపై జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వర శర్మతో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు.
రైతులను పిలిపించుకొని గుండాల మండలం అనేది జనగామ జిల్లా పరిధిలోకి రానందున కొనుగోలు విషయంలో సాంకేతిక సమస్య తలెత్తే అవకాశం ఉందని, రైతులకు నచ్చచెప్పి వారి సమస్యను పరిష్కరించారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు కలెక్టర్ పుష్పగుచ్చాలతో మర్యాద పూర్వకంగా కలిశారు.