మైనారిటీలకు సంక్షేమ పథకాల పేరుతో ప్రత్యేకంగా బడ్జెట్ లో నిధులు కేటాయించడం రాజ్యాంగ ఆదేశిక సూత్రాలకు విరుద్ధమని సనాతన వైదిక ధర్మ న్యాయవాది విష్ణు శంకర్ జైన్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. 2019-20 బడ్జెట్లో మైనారిటీ వర్గాలకు రూ .4,700 కోట్లు కేటాయించడం వల్ల మెజారిటీ హిందూ సమాజంపై వివక్షత చూపినట్లు అవుతుందని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు చెందిన ఐదుగురు వ్యక్తులు ఈ పిటిషన్పై సంతకాలు చేశారు. వివిధ పథకాల ద్వారా వక్ఫ్ బోర్డు, వక్ఫ్ ఆస్తులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తున్నదని అదే సమయంలో, హిందూ సమాజానికి, హిందూ సంస్థలకు ఆర్థిక సహాయం అందించడం లేదని వారు పేర్కొన్నారు. ఇది లౌకికవాదం, సమానత్వం ఉల్లంఘన అని వారు వాదించారు. జస్టిస్ ఆర్ఎఫ్ నరిమన్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించి కేంద్రానికి నోటీసులు పంపింది.
పిటిషనర్లు చట్టబద్ధంగా సంబంధిత ప్రశ్నను లేవనెత్తారని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పిటిషన్ను పరిగణనలోకి తీసుకోవాలని, ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని కోర్టుకు తెలియజేస్తామని చెప్పారు. ఈ కేసును ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం పరిశీలిస్తుందని, అవసరమైతే విస్తృత ధర్మాసనానికి కూడా అప్పగించవచ్చునని సుప్రీం కోర్టు తెలిపింది. మైనారిటీ సమూహాలను సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడినవారిగా ఇప్పటి వరకూ ప్రకటించలేదని అందువల్ల మత ప్రాతిపదికన ఆర్థిక సహాయం అందించడం రాజ్యాంగ విరుద్ధమని పిటీషనర్లు వాదించారు. మైనారిటీ వర్గాలకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుంచి 14 స్కీములు అమలు చేస్తున్నారు. ఇందులో మిగిలిన మైనారిటీల కన్నా ఎక్కువ భాగం ముస్లిం సమాజానికి మేలు కలిగిస్తున్నది. ఆర్టికల్ 30 ప్రకారం మత ప్రాతిపదికన మైనారిటీలను వేరుగా చూసే అవకాశం లేదని వారు వాదించారు.