బాలిక వక్షోజాలను తను వేసుకున్న బట్టలు అలాగే ఉంచి వత్తితే నేరమా లేక బట్టలు తీసి వత్తితేనే నేరమా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పిన బొంబాయి హైకోర్టు నాగపూర్ బెంచ్ తీర్పుపై ఇప్పుడు తీవ్రమైన విమర్శలు చెలరేగుతున్నాయి.
ఈ నెల 19న ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు బహిరంగ వేదికలపై చర్చనీయాంశంగా మారింది. సెషన్స్ కోర్టు 39 ఏళ్ల సతీష్ అనే ఈ నిందితుడికి ఐపిసి 354 సెక్షన్ ప్రకారం మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించింది.
సతీష్ అనే నిందితుడు 12 సంవత్సరాల ఒక బాలికను ఆహారం ఇస్తానని చెప్పి తన ఇంట్లోకి తీసుకువెళ్లి ఆమె వక్షోజాలను ముట్టుకున్నాడు.
ఆ బాలిక వేసుకున్న బట్టలను తీసేందుకు ప్రయత్నిస్తుండగా ఆ బాలిక సహాయం కోసం అరవడంతో అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేయగా సెషన్స్ కోర్టు శిక్ష విధించింది.
అయితే పోక్సో (POCSO) చట్టం లోని సంబంధిత సెక్షన్ పై బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుష్పా గాండియా వాలా కొత్త భాష్యం చెప్పి అతడిపై కేసును కొట్టి వేశారు.
నిందితుడు ఆ బాలిక వక్షోజాలను నేరుగా తాకాడా లేక వేసుకున్న బట్టలపై నుంచే తాకాడా అనేది ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
చట్టంలో స్కిన్ టు స్కిన్ టచ్ (నేరుగా చేతులతో వక్షోజాలను తాకడం) అనేది ఉందని, నిందితుడు బాలిక వక్షోజాలను ఆమె వేసుకున్న బట్టల పై నుంచే వత్తినట్లుగా చెబుతున్నందున చట్టంలో పేర్కొన్నట్లు స్కిన్ టు స్కిన్ టచ్ లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు.
అందువల్ల నిందితుడిపై నేరం రుజువు కాలేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. తనను లైంగికంగా వేధించాడని 2016 డిసెంబర్ లో కోర్టుకు చెప్పిన బాలిక స్టేట్ మెంట్ ను న్యాయ స్థానం పరిగణలోకి తీసుకోలేదు.
ఈ వివరాలపై పలు మహిళా, బాలికల హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.