బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేరికతో తెలుగుదేశం పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపించే కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరడం తమకు శుభసూచకమని తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ నేడు మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గత కొంత కాలంగా ఆయన టిడిపిలో చేరతారని ప్రచారం జరిగింది.
అయితే మధ్యలో కొన్నాళ్లు ఆయన ‘జనసేన’లో చేరతారని కూడా కొందరు అనుకున్నారు. అయితే అన్ని ఊహాగానాలకు తెరదించుతూ ఆయన టీడీపీలో చేరారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేపట్టిన ఇదేం ఖర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. అంతకు ముందు బాదుడే బాదుడు కార్యక్రమం కూడా విజయవంతం అయింది.
ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరడంతో పార్టీకి మరింత ఊపు వచ్చింది. గతంలో ఆయనను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించినప్పుడే ఆయన టిడిపిలోకి వస్తారని వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో అది జరగలేదు. ఎన్నికలకు ఏడాది ముందు జరిగిన ఈ చేరిక టిడిపికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు భారీ ఎత్తున మారిపోతున్నాయి.
వ్యక్తిగత ఛరిష్మాతో పాటు అంగ, అర్థబలం ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు టిడిపిలో చేరడంతో టిడిపితో పాటు ఆయనకు కూడా మంచే జరగనున్నది. రాబోయే ఎన్నికల్లో ఆయన ఎక్కడ పోటీ చేసినా ఆయన గెలవడం సులభమే. ఆయన చేరికతో టిడిపికి కాపు సామాజికవర్గం నుంచి బలమైన మద్దతు లభించబోతోంది. ఒకవైపు కాపు సామాజికవర్గం మొత్తం పవన్ కల్యాణ్ వైపు ఉంటుందని రాజకీయవర్గాలు భావిస్తున్న సమయంలో కన్నా లక్ష్మీనారాయణ లాంటి కాపు కులానికి చెందిన అగ్ర నేత టిడిపిలో చేరడం రాబోయే రోజుల్లో విపరీతమైన పరిణామాలకు దారి తీయబోతున్నది. మొత్తం మీద అటు కన్నాకు ఇటు టిడిపికి సమాన లాభం చేకూరబోతున్నదని కూడా చెప్పవచ్చు.