ఎకరంలో స్థలంలో కట్టుకున్న మహారాజ ప్యాలెస్ లాంటి ఇంట్లోకి ఈ నెల 22న ముఖ్యమంత్రి కేసీఆర్ గృహప్రవేశం కానున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో నిర్మితం అవుతున్న ఈ రెండో ఇల్లు సిఎం కేసీఆర్ తన అభీష్టానికి నిర్మించుకున్నారు. ఈ విలాసవంతమైన రాజ ప్రసాదం నిర్మాణం దాదాపు ఎకరం విస్తీర్ణంలో జరుగుతున్నది.
దేశ ప్రముఖులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు సహా ఇతర అతిధులు ఎవరు వచ్చినా వారి వారి స్థాయిలను బట్టి ఆతిధ్యం ఇచ్చేందుకు, సమీక్షలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవటానికి పెద్ద, పెద్ద హాళ్ళు ఇక్కడ నిర్మాణంలో ఉన్నాయి. కాన్ఫరెన్స్ హాల్, భోజనం చేయటానికి స్పెషల్ రూమ్, గెస్ట్ ల కోసం అవుట్ హౌస్ కూడా ఉంది.
సీఎం కెసిఆర్ కొంత కాలంగా దగ్గరుండి మరి ఈ కొత్త ఇంటిని నిర్మాణాలను తన అభిరుచికి అనుగుణంగా నిర్మించుకుంటున్నారు. తెలంగాణ భవన్ ఎలా ఉంటుందో సరిగ్గా అలాగే ఇక్కడ కూడా స్పెషల్ గా డిజైన్ చేశారని, అందుకోసం అనేక మంది ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ నిపుణులతో చర్చలు జరిపి ప్రత్యేక శైలిలో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. నిజాం రాజుల తరహా డిజైన్ ఉంటుంది.
ఏ వస్తువు ఎక్కడ ఉండాలనే విషయంలో సీఎం కేసీఆర్ ప్రముఖ వాస్తు నిపుణుల అభిప్రాయం తీసుకుంటున్నారు. ఇంతటి విశాలమైన భవనం నిర్మించడానికి ఎంత ఖర్చు పెడుతున్నారనే విషయం మాత్రం తెలియదు.