వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో కలిపి 80 లక్షల ఇళ్లను పూర్తి చేయడానికి 48,000 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రకటించారు.
పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతి, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) కోసం సరసమైన గృహాలను ప్రోత్సహించడం కోసం, అన్ని భూమి, నిర్మాణ సంబంధిత అనుమతుల కోసం అవసరమైన సమయాన్ని తగ్గించడానికి కేంద్రం రాష్ట్రాలతో కలిసి పని చేస్తుందని ఆమె చెప్పారు.
మెరుగైన భూ రికార్డుల నిర్వహణ కోసం, ఐటీ ఆధారిత రికార్డుల నిర్వహణను సులభతరం చేసేందుకు యూనిక్ ల్యాండ్ పార్శిల్ ఐడెంటిఫికేషన్ నంబర్ను స్వీకరించేలా రాష్ట్రాలను ప్రోత్సహిస్తామని సీతారామన్ చెప్పారు. నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (NGDRS)తో అనుసంధానం చేసేందుకు ‘వన్-నేషన్ వన్-రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్’ రూపొందిస్తున్నట్లు తెలిపారు.
‘ఎక్కడైనా రిజిస్ట్రేషన్’ కోసం ఏకరీతి ప్రక్రియ కూడా ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) (PMAY-G) కార్యక్రమం కింద 2020-21లో 33.99 లక్షల ఇళ్లు, నవంబర్ 25, 2021 నాటికి 26.20 లక్షల యూనిట్లు పూర్తయ్యాయని సోమవారం ఆర్థిక సర్వే హైలైట్ చేసింది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) (PMAY-U) కోసం, FY21లో 14.56 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని సర్వే పేర్కొంది. 2021-22లో డిసెంబర్ 2021 వరకు 4.49 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి.