ఆర్ధికంగా రాష్ట్రం ఎటు పోతున్నా తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని వై ఎస్ జగన్ నిర్ణయించుకున్నట్లే కనిపిస్తున్నది. మరీ ముఖ్యంగా మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేదే లేదని ఆయన కుండబద్దలు కొడుతున్నారని అంటున్నారు.
దీనికి వేదికగా ఆగస్టు 15వ తేదీని ఆయన ఎంచుకున్నట్లు చెబుతున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు దేశ ప్రధాని, రాష్ట్రాల ముఖ్యమంత్రులు పతాకావిష్కరణ జరుపుతారు. ఒక రాజధాని ఉంటే ముఖ్యమంత్రి అక్కడ నుంచి పతాకావిష్కరణ చేస్తారు.
లేదా వీలుగా ఉన్న ఏదో ఒక ప్రాంతం నుంచి కూడా ముఖ్యమంత్రి పతాకావిష్కరణ చేయవచ్చు. ప్రధాని పతాకావిష్కరణ చేసిన తర్వాత కొద్ది నిమిషాల వ్యవధిలో ముఖ్యమంత్రులు, ఆ తర్వాత కొద్ది సేపటికి జిల్లాల్లో ఇన్ చార్జి మంత్రులు పతాకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఈ సారి ముఖ్యమంత్రి జగన్ విశాఖ పట్నం వేదికగా స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నారు. 13వ తేదీన అక్కడకు వెళుతున్న జగన్ 15న జెండా వందనం కూడా అక్కడే నిర్వహించే వీలు ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది.
13వ తేదీ శ్రావణ మాసం పంచమి తిథి కావడంతో ఆ రోజున ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొని అక్కడే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకుంటారని తెలిసింది. రాజధానుల ఏర్పాటుకు ఆ రోజుతో శ్రీకారం చుట్టినట్లు అవుతుంది.
అధికారికంగా పాలనా రాజధానిగా విశాఖను ప్రకటించేందుకు న్యాయ స్థానాలలో కేసులు ఉండటం వల్ల ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం పేరుతో పాలన అక్కడ నుంచి చేయాలని ఆయన అనుకుంటున్నారు. మూడు రాజధానులు కదా ఒక్క విశాఖ నుంచి మాత్రమే పతాకావిష్కరణ చేస్తే ఎలా?
మిగిలిన రెండు చోట్ల కూడా పతాకావిష్కరణ జరపాలి కదా? అందుకే ఒక కొత్త ఐడియా ను సిద్ధం చేశారు. అమరావతిలో అసెంబ్లీ ఎటూ ఉంది కాబట్టి అక్కడ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని శీతారాం పతాకావిష్కరణ చేస్తారు. ఇక న్యాయ రాజధాని కర్నూలు విషయం ఏమిటంటే అక్కడికి హైకోర్టు తరలి వెళ్లలేదు. విజిలెన్సు కార్యాలయం ఏర్పాటు చేద్దామనుకుంటే కుదరలేదు.
ఇప్పుడు జగన్ కు మరో అవకాశం వచ్చింది. కర్నూలు లోకాయుక్త కార్యాలయం పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడ్డది. ఇప్పటికే కర్నూలు లోని బళ్లారి చౌరాస్తాలో బిల్డింగ్ చూసి వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న లోకాయుక్త కార్యాలయం ఏపికి తరలించాల్సిన అనివార్య పరిస్థితులు వచ్చాయి. దాంతో కర్నూలు వేదికగా లోకాయుక్త కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
దీనితో బాటు ఈ నెలాఖరు లోగా మానవ హక్కుల కమిషన్ కార్యాలయం కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. నెలాఖరులోగా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే హైకోర్టు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అందువల్ల ఆ కార్యాలయాన్ని కూడా కర్నూలులో ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ రెండు కార్యాలయాలు కర్నూలులో ఏర్పాటు చేసి అక్కడ పతాకావిష్కరణ చేయాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు.
మంత్రి వర్గంలో సీనియర్ మంత్రిని కానీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిని గానీ ప్రభుత్వం దీనికోసం ప్రత్యేకంగా నియమించవచ్చునని అంటున్నారు. విశాఖ, అమరావతి, కర్నూలులో ఏకకాలంలో పతాకావిష్కరణ చేయడం ద్వారా మూడు రాజధానులు ప్రారంభం అయినట్లే అవుతుందని అంటున్నారు.
మూడు రాజధానులు ఏర్పాటు చేయడం, ముఖ్యమంత్రి జగన్ విశాఖ తరలి వెళ్లడం లాంటి రెండు కార్యక్రమాలు నిర్వహిస్తే ఇప్పుడు ఉన్న చిక్కులన్నీ తొలగిపోతాయని రాజగురువు చెప్పారు. అందుకే ఈ నిర్ణయంపై వర్కవుట్ చేస్తున్నట్లు తెలిసింది.