రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య తగ్గింది. గత నెల క్రితంతో పోలిస్తే 8.44 లక్షల కార్డులను తొలగించారు. ఈ నెల నుంచి పాత రేషన్ కార్డులను పక్కన పెట్టి, కొత్త బియ్యం కార్డులపై నిత్యావసరాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రేషన్ కోసం వెళ్లే కార్డుదారులు గత నెల రేషన్ ఇచ్చి, ఈ నెల ఎందుకు నిలిపి వేస్తున్నారని డీలర్లను నిలదీస్తున్నారు. వైఎస్ఆర్ నవశకంలో భాగంగా రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా బియ్యం కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం గత ఏడాది నిర్ణయించింది. వాలంటీర్లతో ఇంటింటి సర్వే చేసి కొత్త కార్డులు జారీ చేసింది. 2020 ఏప్రిల్ నుంచి కొత్త బియ్యం కార్డులపైనే రేషన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇంతలో కరోనా ప్రభావం తీవ్రం కావడం, లాక్డౌన్ ప్రకటించారు.
దీంతో బియ్యం కార్డులను పక్కనపెట్టి పాత రేషన్ కార్డుల ఆధారంగానే నవంబరు నెలాఖరు వరకు ఉచిత రేషన్ పంపిణీ చేశారు. అయితే, డిసెంబరు నుంచి పాత రేషన్ కార్డులను పక్కన పెట్టి కొత్త బియ్యం కార్డులపై నిత్యావసరాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీంతో కార్డుల సంఖ్య 1,52,70,000 నుంచి 1,44,26,000కి తగ్గింది. నెల క్రితంతో పోలిస్తే 8.44 లక్షల కార్డులను తొలగించింది.