ఆపదలో ఉన్న చేనేత కార్మికులను ఆదుకునేందుకు ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకానికి శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఐదేళ్లలో ప్రతి ఏటా రూ.24 వేల చొప్పున మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి అందజేస్తామని ఆయన అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని ఆయన ప్రారంభించారు.
‘ఆత్మహత్యలు చేసుకుంటున్న చేనేత కుటుంబాలను ఏ ఒక్కరు పట్టించుకోకపోతే గళం విప్పి గట్టిగా అడిగాం. నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి అడుగులో చేనేతలు పడిన కష్టాలు చూశాను. మీ బాధలు విన్నాను. ఆ రోజు నేను ఉన్నాను..నేను ఉన్నానని చెప్పాను. ఇచ్చిన మాట ప్రకారం ఈ పథకం అమలు చేస్తున్నాను అని ఆయన అన్నారు. నేతన్నలు గౌరవంగా జీవించేందుకు ఈ సహాయం గొప్పగా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. అవినీతి, వివక్షకు తావు లేకుండా ఏపార్టీ, ఏ కులం, మతం అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అన్ని పథకాలను వర్తింపచేస్తున్నాం.
ప్రతి ఒక్క పథకం పేదవారికి అండగా నిలిచేందుకు కార్యక్రమాలు రూపొందించాం. ఇంతా బాగా చేస్తున్నా కూడా ఇవాళ జరుగుతున్న పరిస్థితులను మీరంతా చూస్తున్నారు. శత్రువులు ఏం మాట్లాడుతున్నారో మీ అందరూ చూశారని’ జగన్ వివరించారు.