ఇండియన్ ఆర్మీకోసం త్వరలోనే ఒక కొత్త ఆడియో పాటను రూపొందించే పనిలో నిమగ్నమైంది కేంద్ర ప్రభుత్వం. అధికారిక జాతీయ వేడుకల కార్యక్రమాలను ముగించే సమయంలో సైనిక బృందాలు ‘బీటింగ్ ది రిట్రీట్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయన్న విషయం తెలిసిందే. జాతీయ వేడుకల ముగింపు సమయంలో భారతీయ శాస్త్రీయ సంగీత వాయిద్యాలతో మిలటరీ దళాలు దేశ ప్రజలందరినీ ఆకట్టుకుంటాయి. ఈ ముగింపు వేడుకల సమయంలో ఆర్మీ జవాన్ల కోసం సైనిక బృందాలు ప్లే చేయడానికి లిరికల్ హిందీ పాటను రూపొందించే పనిలో నిమగ్నమయ్యాయి.
3 ప్రైవేటు సంగీత సంస్థల నుంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఆర్మీ అధికారులు ఈ పాటలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు భారత దేశ సైనిక వేడుకల్లో ప్లే చేసిన ట్యూన్లకు బ్రిటిష్ మూలాలు ఉన్నాయి. ఇప్పటికీ వివిధ సైనిక అకాడమీలలో పాసింగ్ అవుట్ పరేడ్ల సమయంలో బ్రిటిష్ మూలాలున్న ఐకానిక్ ‘ఆల్డ్ లాంగ్ సైన్’ ట్యూన్నే ప్లే చేస్తున్నారు. అబైడ్ విత్ మీ అనే క్రైస్తవ శ్లోకాన్ని ప్రతియేటా జనవరి 29న జరిగే బీటింగ్ ది రిట్రీట్ వేడుకలో ప్లే చేస్తున్నారు. ఇది సారే జహాన్ సే అచ్చా అనే ట్యూన్ మిలట్రీ దళాలు ప్లే చేయకముందు ప్లే చేస్తున్నారు.
ఈ ఏడాది జరిగిన బీటింగ్ ది రిట్రీట్ కార్యక్రమంలో ‘స్వర్ణిమ్ విజయ్’ తో సహా కొన్ని కొత్త భారతీయ ట్యూన్లు ప్లే చేశారు. గతేడాది ముగింపు వేడుకలో ‘అబైడ్ విత్ మీ’ ట్యూన్కి బదులుగా వందేమాతరం ట్యూన్ ప్లే చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల రెండేళ్లుగా ‘అబైడ్ విత్ మీ’ ట్యూన్ నే ప్లే చేసారు. ఈ కొత్త స్వదేశీ ఆడియో ట్యూన్ ని ‘అబైడ్ విత్ మీ’ లేదా మరేదైనా మిలిటరీ ట్యూన్లకు బదులుగా ప్లే చేస్తారా? లేక ఈ వేడుకల్లో ఒక అదనపు ట్యూన్ గా యాడ్ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
అధికారిక జాతీయ వేడుకల ముగింపులో చివరి ప్రదర్శనకి సరిగ్గా సూటయ్యే ట్యూన్ ను రూపొందించాలని ఆర్మీ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ అడిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కొత్త పాటను అమరవీరులు, వారి బంధువుల త్యాగాలకు అంకితం చేస్తామని ఆర్ఎఫ్పీ చెబుతోంది. పాట సాహిత్యం కాలాతీతమైనదిగా, హృదయాలను కదిలించేదిగా, ఆధ్యాత్మికంగా ఆకట్టుకునేలా ఉంటుందని ఆర్ఎఫ్పీ వివరించింది. దేశ రక్షణలో సైనికులు ఎదుర్కొనే కష్టాలను పాటరూపంలో తీసుకొస్తామని తెలిపింది.