మ్యుటేషన్ చెందిన కరోనా కొత్త స్ట్రెయిన్ భారత్ కు వచ్చేసిందా? వచ్చేసినట్లే కనిపిస్తున్నది. లండన్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఢిల్లీలో ఐదుగురు, చెన్నై లో ఒకరికి కరోనా పాజిటివ్ కనిపించింది. దాంతో కొత్త స్ట్రెయిన్ భారత్ లో అడుగుపెట్టేసిందని భావిస్తున్నారు.
నిన్న రాత్రి లండన్ నుండి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న 266 మంది ప్రయాణికులు, సిబ్బందిలో ఐదుగురికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. కరోనా సోకినవారి నమూనాలను పరిశోధన కోసం ఎన్సిడిసికి (నేషనల్ సెంటర్ ఫర్ డిసిస్ కంట్రోల్ ) అధికారులు పంపారు.
అదే విధంగా లండన్ నుంచి ఢిల్లీ మీదుగా చెన్నై వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నది.
దీంతో లండన్ నుంచి వచ్చిన మరో 14 మంది ప్రయాణికులను చెన్నై అధికారులు పరిశీలనలో ఉంచారు. లండన్ తో ప్రయాణ సంబందం ఉన్న 1088 మందిని గుర్తించి పర్యవేక్షిస్తున్నట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు.