వైవిధ్యమైన రీతిలో మగవారు మాత్రమే నిర్వహించిన సంజీవరాయ పొంగల్లు వేడుక ఘనంగా జరిగింది. కడప జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయ పల్లె సంజీవరాయ స్వామి ఆలయంలో ఆదివారం మగవారి పొంగల్లు వేడుకగా నిర్వహించారు.
ఈ వేడుకకు స్థానికులే కాకుండా వృత్తి రీత్యా వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల్లో స్థిర పడిన మగవారు కూడా పొంగల్లు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. పూర్వం తిప్పాయ పల్లె గ్రామంలో ఓ వృద్ద సన్యాసి తిరిగేవాడని ఆయన మహిళలు పెట్టె ఆహారం తినేవాడు కాడని, ఈ గ్రామంలో విడిచి వెళుతూ ఆంజనేయస్వామిని సంజీవరాయ స్వామిగా నామకరణం చేసి ప్రతిష్ఠించినట్టు పెద్దలు చెబుతారు.
ఆయన సూచనల మేరకు ఆలయం గోపురం నిర్మించకుండా ప్రహరీ గోడ నిర్మించారని చెబుతారు. మహిళలు పొంగల్లు పెట్టె సమయంలో ఆలయ ప్రవేశం చేయకుండా ప్రహరీ బయటనుంచి స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చునని, మగవారు మాత్రమే ఆలయ ఆవరణంలో పొంగల్లు పెట్టి ఆ ప్రసాదాన్ని మగవారు మాత్రమే తినాలట.
స్వామి సూచనలను నేటికి ఆచరించడం మూలంగా గ్రామంలో అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని, దేశ విదేశాలల్లో వృత్తి, వ్యాపార రీత్యా స్థిర పడినారని భక్తులు తెలిపారు. ఇందులో భాగంగానే గ్రామంలోని వారే కాకుండా జిల్లా నలుమూలల నుంచి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించు కొని పూజలు నిర్వహించారు.