ఏపీలోని విజయనగరం జిల్లాలో నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ నిర్వహించే వేడుకలకు ఎటువంటి అనుమతులు
లేవని జిల్లా ఎస్పీ రాజకుమారి స్పష్టం చేసారు. కరోనా దృష్ట్యా ప్రశాంత వాతావరణంలో ఇండ్ల వద్దనే నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని సూచించారు.
నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ డిసెంబరు 31 రాత్రి నిర్వహించుకొనే వేడుకలకు యువత దూరంగా ఉండాలని యువతను ఉద్దేశించి ఎస్పీ అన్నారు. నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకొని జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు తలెత్తకుండా అన్ని పోలీసు స్టేషను పరిధిలో, సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.
బ్లూ కోల్ట్, రక్షక్, పెట్రోలింగు వాహనంలు మరియు రోడ్ సేఫ్టీ వాహనములు సహాయంతో నిరంతరం గస్తీ ఏర్పాటు చేసి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
నూతన సంవత్సర వేడుకల పేరుతో ప్రజలెవ్వరూ గుంపులుగా గుమిగూడ వద్దని, రోడ్లపై కేక్ కటింగులు చేసి, ఇతరులకు, ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగించడం చేస్తే, వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వ్యాపార సంస్థలు ఇతర షాపుల వారు రాత్రి 10 గంటలకు యధావిధిగా మూసివేయాలన్నారు. హెటల్స్, రెస్టారెంట్లు, ఫంక్షను హాల్స్ కు నూతన సంవత్సర వేడుకల నిర్వహణకు ఎటువంటి అనుమతులు లేవన్నారు. ప్రభుత్వం అనుమతించిన ప్రకారం మద్యం షాపులకు రాత్రి 8 గంటల వరకు, బార్ అండ్ రెస్టారెంట్లుకు రాత్రి 10 గంటలకు వరకు మాత్రమే అనుమతి ఉందన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా మద్యం విక్రయాలు జరిపినా, షాపులు తెరిచినా చర్యలు తప్పవన్నారు. నూతన సంవత్సర వేడుకల పేరుతో మహిళలను ఇబ్బందులకు గురి చేసినా, ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా కాల్చడం, ట్రిపుల్ రైడింగు చేసినా, వేగంగా వాహనాలు నడిపినా, మద్యం సేవించి వాహనాలు నడిపినా వారిపై కఠినమైన చర్యలు తప్పవన్నారు. నూతన సంవత్సర వేడుకల పేరుతో ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే డయల్ 100, పోలీసు వాట్సాప్ నంబరు 6309898989కు సమాచారాన్ని అందించాలని ప్రజలను జిల్లా ఎస్పీ రాజకుమారి కోరారు.