దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్ ప్రతిపాదించారు. CJI లలిత్ పదవీకాలం 8 నవంబర్ 2022తో ముగుస్తుంది. ఆయన కేవలం 74 రోజులు మాత్రమే ఈ పదవిలో ఉంటారు. CJI గా ఎన్ వి రమణ పదవీకాలం పూర్తయిన తర్వాత 26 ఆగస్టు 2022న జస్టిస్ లలిత్ దేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
నవంబర్ 8వ తేదీన రిటైర్ కానున్న CJI లలిత్ తన వారసుడిగా జస్టిస్ చంద్రచూడ్ పేరును సూచిస్తూ న్యాయశాఖకు లేఖ రాశారు. నవంబర్ 9 నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ బాధ్యతలు చేపడతారు. ఈ మేరకు తదుపరి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంపికలో భాగంగా తదుపరి సీజేఐ పేరును ప్రతిపాదించాలని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత సీజేఐ జస్టిస్ యుయు లలిత్ని కోరింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ లలిత్కు కేంద్ర న్యాయ శాఖ లేఖ రాసింది.
దీంతో ఆయన తన తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే న్యాయమూర్తి పేరును కేంద్రానికి సిఫారసు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఉన్న అత్యంత సీనియర్ న్యాయమూర్తిని తదుపరి సీజేఐగా సూచిస్తారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఉన్న వారిలో యుయు లలిత్ తర్వాత డీవై చంద్రచూడ్ సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు. దీంతో ఆయన పేరును సూచిస్తూ కేంద్రానికి ప్రతిపాదించారు. ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ (డీవై చంద్రచూడ్) 1959లో జన్మించారు.
ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ చదివారు. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి 1982లో లా పట్టా పొందారు. హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఎంఎల్ చేశారు. జ్యుడీషియల్ సైన్స్లో డాక్టరేట్ కూడా సాధించారు. పలువురు ప్రముఖ న్యాయవాదుల వద్ద జూనియర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అలహాబాద్ హైకోర్టుకు 2013లో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. డీవై చంద్రచూడ్ తండ్రి వైవీ చంద్రచూడ్ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుదీర్ఘకాలం పనిచేశారు.