నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లి వేడుకలో నిర్వహించిన బారాత్ లోని డీజే సౌండ్స్ పడక అస్వస్థతకు గురై వివాహమైన కొద్దిసేపటికే వరుడు మంగళి గణేశ్(25) మృతి చెందాడు.శుక్రవారం మధ్యాహ్నం గణేశ్కు వివాహం జరిగింది. అప్పగింతలు కార్యక్రమం అయ్యాకా రాత్రి పెళ్లి వేడుకలో భాగంగా బారాత్ నిర్వహించారు. డీజే సౌండ్కు అస్వస్థతకు గురైన గణేశ్ ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలాడు.
అప్రమత్తమైన బంధువులు వెంటనే గణేష్ ను నిజామాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 2గంటల సమయంలో గుండెపోటుతో వరుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
నూరేళ్లు తోడుంటానని ప్రమాణం చేసి ఇంటికి తీసుకువచ్చిన భర్త కొద్ది సేపటికే దూరమయ్యాడంటూ వధువు, బంధువుల రోదనలు మిన్నంటాయి. అప్పటి వరకు తమతో హుషారుగా నృత్యం చేసిన వరుడు మృతి చెందడంతో బంధుమిత్రులు విషాదంలో మునిగిపోయారు