నాన్న మాజీ సిఎం, తాత మాజీ పిఎం, తానూ ఓ సెలబ్రిటీ… పుష్కలంగా డబ్బు. ఇంకేంకావాలి? కరోనా అయితే ఏమిటి కోవిడ్ అయితే ఏమిటి? నేను అనుకున్నది చేయలేనా? చేసేయచ్చు అని నిరూపించాడు కర్నాటక మాజీ సిఎం కుమారస్వామి కొడుకు, ప్రముఖ సినీ నటుడు నిఖిల్.
ఈ రోజు బెంగుళూరు లో ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. మామూలు వాళ్లు పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటుంటే నాకేం ఖర్మ అనుకున్న నిఖిల్ అంగరంగ వైభవంగా పెళ్లి చేసేసుకున్నాడు. లాక్ డౌన్ పీరియడ్ అయినా భారీ ఎత్తున గెస్టులు వచ్చారు. ఆశీర్వదించారు.
లాక్ డౌన్ సమయంలో వంద మంది కన్నా ఎక్కువ మంది అతిధులతో పెళ్లిళ్లు చేసుకోవడం నిషేధం. అయితే బెంగళూరుకు 50 కిలోమీటర్ల దూరంలోని రామనగర ఫామ్ హౌస్ లో నిఖిల్ పెళ్లి జరిగింది. వచ్చిన అతిధులందరికి కరోనా పరీక్షలు నిర్వహించామని కుమారాస్వామి కార్యాలయం తెలిపింది.
అందరికి శానిటైజర్లు సరఫరా చేశామని, సోషల్ డిస్టెన్సింగ్ ఉండేలా చూశామని వివరించారు. వివాహ సమయంలో అందరూ మాస్కులు ధరించి ఉండాలని చెప్పామని అందుకు తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు.
అధికారికంగా అతిధుల సంఖ్య 75 చూపించారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, కాంగ్రెస్ నాయకుడు ఎం కృష్ణప్ప మనుమరాలు రేవతి తో నిఖిల్ పెళ్లి జరిగింది.