రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ను పునర్ నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం శుక్రవారం లోపు ఆయనను మళ్లీ నియమించాల్సి ఉంది. ఆఖరు నిమిషం వరకూ వేచి చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి ఆయనను పునర్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర గవర్నర్ పేరుతో పంచాయితీరాజ్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ రమేష్ కుమార్ ను కొనసాగించాలని రాష్ట్ర హైకోర్టు తీర్పు చెప్పినా కాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ కూడా చుక్కెదురు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.