నిర్భయపై దారుణ హత్యాచారం చేసి తీహార్ జైల్లో రీమ్యాన్డ్ లో ఉంటూ ఈ నెల 22న ఉరిశిక్షను అనుభవించనున్న నలుగురు నిందితుల్లో ముగ్గురు జైల్లో పని చేసి సంపాదించిన డబ్బును వారి వారి కుటుంబీకులకు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.
దోషి ముఖేశ్ సింగ్ అందరికన్నా ఎక్కువగా రూ. 69 వేలు సంపాదించగా, వినయ్ శర్మ రూ. 39 వేలు, పవన్ గుప్తా రూ. 29 వేలు సంపాదించాడని వెల్లడించిన అధికారులు, అక్షయ్ కుమార్ మాత్రం కూలీ పనులు చేసేందుకు నిరాకరించి ఏ పని చేయనందున ఆయనకు ఎలాంటి వేతనమూ దక్కలేదని తెలిపారు.కాగా వీరి చివరి సంపాదన వీరి కుటుంబ సభ్యుల అవసరాలకు ఉపయోగ పడుతుందో లేదో చూడాలి.
ఇదిలావుండగా, దోషులను ఉరి తీసేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నలుగురికీ పెడుతున్న భోజనాన్ని తగ్గించారు. జైలులో వినయ్ శర్మ పలుమార్లు అనుచితంగా ప్రవర్తించినందున అతన్ని 11 సార్లు శిక్షించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. పవన్ గుప్తా 8 సార్లు, అక్షయ్ కుమార్ 3 సార్లు, ముఖేశ్ సింగ్ ఒకసారి శిక్షకు గురయ్యారని చెప్పారు.
ప్రస్తుతం వీరంతా కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రత్యేక జైలు గదుల్లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచామని, వీరికి 22న ఉదయం 7 గంటలకు శిక్షను అమలు చేసి, ఆపై వారు చనిపోయే వరకూ వైద్యలు నిరంతరం కనిపెడుతూ ఉంటారని అన్నారు. కాగా, వీరిపై డెత్ వారెంట్ ఇప్పటికే జారీ కాగా, క్యూరేటివ్ పిటిషన్ ను సైతం సుప్రీంకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే.