పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదును పకడ్బందీగా చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదుపై నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమవేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదు సర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని పేర్కొన్నారు. సర్వే ప్రక్రియలో భాగంగా ఆస్తుల వివరాల నమోదును వేగవంతం చేసి నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని సూచించారు.
ఇప్పటివరకు జిల్లాలో లక్షా 75 వేల కుటుంబాలకు గాను కేవలం 40 వేల కుటుంబాలకు మాత్రమే సర్వే పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. గురువారం నుండి ఒక్కొక్క సర్వే బృందం రోజుకు కనీసం అరవై సర్వేలు నిర్వహించాలని సూచించారు.
యజమానికి సంబందించిన అన్ని వివరాలను పక్కాగా ఆన్ లైన్ లో నమోదు చేయాలన్నారు. అంతర్జాలంలో ఏమైనా అంతరాయం ఏర్పడితే యజమాని వివరాలను దరఖాస్తు రూపంలో సేకరించి తర్వాత ఆన్ లైన్ లో నమోదు చేయాలనీ వివరించారు.
సర్వే కార్యక్రమాన్ని జిల్లా అధికారులతో పాటు ఎంపీడీవోలు ప్రతి రోజు పర్యవేక్షణ చేయాలని సూచించారు. సర్వే కార్యక్రమంలో ఏమాత్రం నిర్లక్ష్యం వద్దని, సాంకేతిక లోపాలను అధిగమించి సర్వేలను ప్రభుత్వం నిర్ధేశించిన సమయంలోగా లక్ష్యం పూర్తి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా ఇంచార్జి రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్, జడ్పి సిఈఓ సుధీర్, డిఆర్డిఓ వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, బైంసా ఆర్డీఓ రాజు, తహసీల్దార్లు, ఎంపిడిఓ లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.