కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కు చేపట్టిన లాక్ డౌన్ అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. శనివారం ఢిల్లీ నుండి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ లతో పాటుగా జిల్లా కలెక్టర్ల తో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని, వ్యవసాయ ఆధారిత పనులను ఆటంకం కలిగించవద్దని, మినహాయింపులు ఇచ్చిన రంగాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
వ్యవసాయ ఆధారిత రంగాలకు మినహాయింపు, ఉపాధి హామీ గ్రామీణాభివృద్ధి పనులకు అనుమతివ్వాలని సూచించారు. వలస కూలీలకు కనీస వసతులు కల్పించాలని అన్నారు. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల ను వివరించారు.
పని ప్రదేశాల్లో, బహిరంగ ప్రదేశాల్లో తప్పని సరిగా మాస్క్ లను ధరించాలని సూచించారు. కరోనా పాజిటివ్ కేసుల నమోదు పరిశీలించి లాక్ డౌన్ సడలింపు పై తదుపరి నిర్ణయం ఉంటుందని ఆయన తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో ఉమ్మితే భారీగా జరిమానా విధించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా అయన రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ లు రాష్ట్రం లో చేపడుతున్న చర్యలు, సమస్యల ను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, జిల్లా ఎస్పీ శశిధర్ రాజు,కరోనా నియంత్రణ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.