కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో లాక్ డౌన్ సహకరిస్తున్న మారుమూల ప్రాంతాల ప్రజలను ఆదర్శంగా తీసుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. ఆదివారం ఖానాపూర్ పట్టణానికి చెందిన అనిస్ ఖాన్ వ్యాపారవేత్త సౌజన్యంతో నిత్యావసర సరుకులు, కూరగాయలు ఇతరత్రా వస్తువులు సమకూర్చగా ఖానాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీర్నంది గ్రామపంచాయతీలోని ఇప్పమాడ, (తుమ్మగూడ) గ్రామస్తులకు వీటిని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ లాక్ డౌన్ సందర్భంగా మారుమూల ప్రాంతాల వారు నిత్యావసర సరుకులు లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఖానాపూర్ పోలీసు అధికారులు వ్యాపారుల దృష్టికి తీసుకెళ్లగా వారు పెద్ద మనసుతో నిత్యావసర సరుకులు సమకూర్చడం అభినందనీయమన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ కరోనా వైరస్ పల్లెల దరిచేరకుండా ఇక్కడి ప్రజలు శ్రద్ధ తీసుకోవడం స్ఫూర్తిదాయకం అన్నారు. లాక్ డౌన్ ముగిసేవరకు అత్యవసరంగా బయటకు వస్తే సామాజిక దూరం పాటిస్తూ మాస్కు ధరించాలి అని సూచించారు. ఈ కార్యక్రమoలో బీర్నంది గ్రామపంచాయతీ లో ఇప్పమాడ, (తుమ్మగూడ) గ్రామస్తులకు 80 కుటుంబాలకు బియ్యం, పప్పు, నూనె, కూరగాయలు, నిత్యావసర సరుకులను అందించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఖానాపూర్ సీఐ జైరాం నాయక్, ఎస్ఐ ఖానాపూర్ భవానీ సేన్, RI క్రిష్ణా ఆంజనేయులు, గ్రామ సర్పంచ్, గ్రామస్తులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.