తెలంగాణలో జంట నగరాల తర్వాత అత్యంత కీలక ప్రదేశంగా ఉన్నవరంగల్ జిల్లాలో ఇటీవలి కాలంలో గంజాయి హబ్ గా మారిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవలి కాలంలో గంజాయి పట్టివేతకు సంబంధించి పలు కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకుంటున్నారు. గంజాయి అమ్మకాలు జిల్లాలో చాపకింద నీరులా విస్తరిస్తున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. నాలుగైదు దశాబ్దాల కాలంగా వరంగల్ పరిసర ప్రాంతాలు గంజాయి వంటి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్ధాగా మారాయనే చెప్పాలి. ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాల, కాకతీయ వైద్య కళాశాల, కాకతీయ యూనివర్సిటీ, ఆర్త్స్ కాలెజ్, సీకెఎం కాలేజ్ పరిసరాలు గంజాయి కంపు కొడుతున్నాయి.
ఎన్ఐటీకి పూర్వవైభవం వచ్చేనా?
పోలీసు యంత్రాంగం మొత్తం కదిలివచ్చినా సరే.. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టి పటిష్టపరిచే ప్రక్రియలో భాగంగా నిఘాి విభాగం ఆశించిన రీతిలో పనిచేయడం లేదని సిఎంకు ఇప్పటికే ఇంటలిజెన్స్ నివేదికలు అందాయి. ఎన్ డి పి ఎస్ యాక్ట్(1995) కింద జిల్లాలో ఇప్పటికే పలువురిపై కేసులు నమోదయ్యాయి. గత ఏడాది నవంబర్ నెలలో వరంగల్ ఎన్ ఐ టి (నిట్)క్యాంపస్ లో గంజాయి సేవనానికి సంబంధించి పదిమంది విద్యార్ధులపై కేసులు నమోదయ్యాయి. అప్పట్లో విద్యార్ధుల అరెస్టు, సస్పెన్షన్ దరిమిలా పరిణామాలు ఈ విద్యా సంస్థ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయనే విమర్శలు రావడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. ఏది ఏమైనా ఎన్ ఐ టి క్యాంపస్ ను తులసి వనంలో గంజాయి మొక్క మాదిరి చేయకూడదని ప్రభుత్వం ధృడ నిర్ణయంతో వ్యవహరిస్తే పూర్వ వైభవాన్నిసంతరించుకుంటుందని అంటున్నారు.