తుఫాన్ ప్రభావం పాఠశాలలపై పడింది. ఐదు జిల్లాల్లో పాఠశాలలకు తుఫాను కారణంగా సెలవులు ప్రకటించారు. ఇప్పటివరకు ప్రతిరోజూ 50 శాతం తగ్గకుండా విద్యార్థులు తరగతులకు హాజరవుతుండగా 5 జిల్లాల్లో సెలవులు కారణంగా దాదాపు 30 శాతం హాజరు నమోదైంది. గురువారం విద్యార్థుల హాజరుకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
గురువారం 10వ తరగతి విద్యార్థులు 23.31 శాతం విద్యార్థులు హాజరయ్యారు. 9వ తరగతి విద్యార్థులు 31.36 శాతం విద్యార్థులు, 8వ తరగతి విద్యార్థులు 28.13 శాతం హాజరయ్యారు. వర్షాల కారణంగా కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అయినప్పటికీ సెలవు సమాచారం వచ్చేలోగానే ఉదయం ఈ 5 జిల్లాల్లో 2 నుంచి 8 శాతం విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. పాఠశాలల్లో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ తరగతులు నిర్వహిస్తున్నాం.
కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రతిరోజూ కోవిడ్ పై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించటం, శానిటైజేషన్, మాస్క్ లు ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అన్ని జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నాం. పాఠశాలల్లో పారిశుధ్య పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం. మాస్క్, శానిటైజేషన్, సామాజిక దూరం విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆదిమూలమపు సురేష్ స్పష్టం చేశారు.