2024 లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల కూటమిలో తాను భాగం కాబోనని అరవీంద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజా ప్రతినిధుల తొలి జాతీయ మహాసభల్లో ఆయన నేడు ప్రసంగించారు. విపక్షాల కూటమి ఎందుకు ఎవరు ఏర్పాటు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఏ కూటమిలో భాగమవుతారని చాలాసార్లు అందరూ అడుగుతున్నారు. కానీ ఎవరితో పొత్తు పెట్టుకోవాలో అర్థం కావడం లేదు. ఎవరు ఎక్కడ ఉన్నారో అర్ధం కావడం లేదు అని ఆయన అన్నారు. ప్రజల మద్దతు ముందు సాధించుకోవాలి అలా చేసినప్పుడే బీజేపీని ఓడించేందుకు సాధ్యమౌతుంది తప్ప మరో విధంగా అది సాధ్యం కాదని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
ఇందుకోసం 130 కోట్ల మంది ప్రజలతో కలిసి వస్తానన్నారు. తన ప్రసంగం మొత్తంలో బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రం విధానాలను మాత్రమే టార్గెట్ చేశారు. ఆయన చెప్పిన విషయాలన్నీ బిజెపిని ఒంటరిగా ఎదుర్కోవాలనే ఆలోచనను ప్రతిబింబిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన అరగంట ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తన పార్టీ నేతలు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్లపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారని అయితే తన పార్టీ నాయకులు నిజాయితీ పరులని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కి పెరుగుతున్న రాజకీయ పలుకుబడిని తగ్గించేందుకే తమ పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటి వరకూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన 285 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసిందని ఆరోపించారు.
ఉచిత పథకాలను పనికిరావని చెప్పిన ప్రధాని ప్రకటనపై కూడా కేజ్రీవాల్ దాడి చేశారు. ఉచిత పథకాల ప్రయోజనాలను ప్రజలకు అందించడం వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమేనని కేజ్రీవాల్ అన్నారు. ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రజలు బలపడాలి అని ఆయన అన్నారు.