కరోనా వైరస్ పై ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపి వైద్య ఆరోగ్య శాఖామాత్యులు ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్(నాని)పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం అమరావతి సచివాలయంలోని 5వ భవనంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన కరోనా వైరస్ పై సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా వైరస్ కు సంబంధించి కేసులేమీ నమోదు కాలేదని దీనిపై ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందని కావున ప్రజలెవ్వరూ దీని గురించి భయపడం లేదా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని బోధనాసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో వెంటనే కరోనా వైరస్ కు సంబంధించి 5 పడకలతో కూడిన ప్రత్యేక(Isolation) వార్డును ఏర్పాటు చేయడంతో పాటు వెంటిలేటర్లను కూడా అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
కరోనా వైరస్ పై తక్షణం రాష్ట్రంలో ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి శ్రీనివాస్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులందరూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా వైరస్ కు సంబంధించి కేసులేమీ నమోదు కాలేదని ప్రజలెవ్వరో ఈ విషయంలో భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.
కరోనా వైరస్ పై వైద్య ఆరోగ్యశాఖ అధికారులందరూ నిరంతరం పూర్తి అప్రమత్తతతో ఉండాలని వైద్య ఆరోగ్య మంత్రి కాళీకృష్ణ శ్రీనివాస్ ఆదేశించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు అరుణ కుమారి, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కమీషనర్ రామకృష్ణ, వైద్య విద్యా సంచాలకులు వెంకటేశ్, డిహెచ్ డిడి సావిత్రి తదితర అధికారులు పాల్గొన్నారు.