విజయనగరం పురపాలక సంఘం… నగర పాలక సంస్థ గా మారిందే కాని అందుకు తగ్గ అభివృద్ధి మాత్రం ఆమడ దూరంలో ఉందని అంటోంది… జనసేన పార్టీ. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యశస్వి నగరంలో తిష్ట వేసిన సమస్య లపై గత కొద్ది రోజుల నుంచీ ఆందోళన చేపడుతూనే ఉన్నారు. తాజాగా మున్సిపల్ కార్పొ రేషన్ బోర్డ్ మార్చినా తీరుమారలేదన్నారు.
జనసేన విజయనగరం ఇంచార్జ్ అయిన ఆమె ఈ మధ్య కొన్ని డివిజన్లలో పర్యటించారు. ఈ పర్యటనల్లో నగరపాలక సంస్థ నుండి ప్రజలు పడుతున్న కొన్ని ఇబ్బందులను గుర్తించారు.ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి, అనంతరం నగరపాలక సంస్థ సహాయ కమీషనర్ ప్రసాదరావు కు వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయనగరం మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్ గా ఆఫీసుకు కి బోర్డ్ మార్చారే తప్ప నగరపాలక సంస్థ తీరుమారలేదని విమర్శించారు. వీధుల్లోను,కాలువల్లోను బ్లీచింగ్ వేయట్లేదని, కాలువల్లో పూడికతీత పనులు చేపట్టట్లేదని, కనీసం కొన్ని ఇళ్లకు కుళాయిల కనెక్షన్లు ఉన్నా నీళ్లు రావట్లేదని దుయ్యబట్టారు. అధికార పాలకవర్గం ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజల బాగోగులు మరిచారని, జనసేన కేవలం ఎన్నికల్లో మాత్రమే ఓడిందని, నిత్యం ప్రజల పక్షాన పోరాడుతోందని అన్నారు.
ఇప్పటికైనా నగరపాలక సంస్థ తీరు మార్చుకొని నగరాన్ని అనారోగ్య నగరంగా కాకుండా ఆరోగ్య నగరంగా ఉంచాలని లేదంటే ప్రజాసమస్య ఎక్కడుంటే అక్కడ జనసేన పోరాడుతోందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నేతలు త్యాడ రామకృష్ణారావు(బాలు),మజ్జి శివశంకర్,రవితేజ, తాతపూడి రామకృష్ణ మాష్టారు, కిలారి ప్రసాద్,బూర్లీ విజయ్, చరణ్, పవన్, గేదెల సాయికుమార్, రఘు, తదితరులు పాల్గొన్నారు.