ఓవైపు కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుందంటూ స్కూళ్లు, కాలేజీలు మూసేయించింది రాష్ట్ర ప్రభుత్వం. మాస్క్ మస్ట్ అని, లేదంటే ఫైన్ లు వేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు పోలీసులు.
కానీ నీతులు చెప్పే అధికారులు, ప్రజా ప్రతినిధులు మాత్రం కోవిడ్ రూల్స్ మాకు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
కూకట్ పల్లి నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో స్వయంగా రాష్ట్ర, ఐటీ మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈకార్యక్రమంలో పాల్గొనేందుకు కోవిడ్ నిబంధనలను గాలికి వదిలేసి, ఏమాత్రం రక్షణ చర్యలు లేకుండానే వేలాదిమంది జనాలను తరలించారు టీఆర్ ఎస్ నేతలు. ఏకంగా బహిరంగ సభను తలపించేలా బస్సులు, ఇతర వాహనాల్లో జనాలను అక్కడికి తీసుకువచ్చారు.
స్వయంగా మంత్రులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఏమాత్రం నిబంధనలు పాటించలేదు.. సరికదా చాలామంది కనీసం మాస్క్ లు కూడా పెట్టుకోకుండానే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సెకండ్ వేవ్ నడుస్తుందని రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటనలు చేస్తుంటే, అదే మంత్రివర్గంలో పనిచేస్తున్న మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బహిరంగ సభకు జనాలను తరలించిన మాదిరిగా జనాలను బస్సుల్లో, ఇతర వాహనాల్లో తరలించిన వారిపై కేసులు నమోదు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.