కడప నగరానికి సుదూరంలో ఉన్న జగనన్న లేఅవుట్ లల్లో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించకుండానే మూడు రోజుల మెగా గ్రౌండింగ్ మేళా తో ప్రజలను/లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులపాలు చేస్తున్నారని సిపిఐ నగర కార్యదర్శి యన్. వెంకట శివ విమర్శించారు.
శుక్రవారం మామిళ్ళపల్లి, ఉక్కాయ పల్లి, కొప్పర్తి , నానా పల్లి లేఅవుట్ లల్లో సిపిఐ ప్రతినిధుల బృందం పర్యటించి ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకటశివ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చేటప్పుడు ప్రభుత్వమే ఇల్లు కట్టి ఇస్తుందని చెప్పారని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇల్లు మీరే కట్టుకోండి అని జగన్ మడమ తిప్పి మాట తప్పినాడని విమర్శించారు.
జగనన్న కాలనీల లేఅవుట్లలో త్రాగడానికి మంచినీళ్లు లేక, ఇల్లు కట్టుకోవడానికి బోరు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కరోనా కష్టకాలంలో హడావుడిగా ఇంటి పునాదులు తీసి ఇల్లు కట్టుకోవాలని, 70వేలు లేదా 50వేలు ఇచ్చి ప్రభుత్వం ఇచ్చే లక్ష 80 వేలు మాకే ఇస్తే మీకు ఇల్లు కట్టిస్తామని మధ్య దళారులు పెట్రేగిపోతున్నారన్నారు.
కరోనా కష్టకాలం అయిపోయిన తర్వాత స్తోమతను బట్టి ఇల్లు కట్టుకుంటామంటుంటే కొంతమంది వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, కొంతమంది కార్పొరేటర్లు ఇంటి స్థలం పట్టా తీసుకుంటామని, రద్దు చేస్తామని బెదిరిస్తున్నారన్నారు. అధికారుల నాయకుల టార్గెట్ ల ప్రకారం ఇబ్బందులు ఉన్నా ఒత్తిళ్ల మేరకు ఇల్లు కట్టుకోడానికి సిద్ధమైతే అక్కడ మౌలిక సౌకర్యాలు ఇంతవరకు ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు.
ఆగమేఘాల మీద మెగా గ్రౌండింగ్ మేళాకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడం హాస్యాస్పదమని, లబ్ధిదారులను మరింత ఇబ్బంది పెట్టడమే అని వారు విమర్శించారు. ఈ మధ్యకాలంలో పునాది రాయి, సిమెంటు, ఇనుము, ఇటుకలు తదితర రేట్లు విపరీతంగా పెరిగినప్పటికీ ప్రభుత్వం హేతుబద్ధంగా ఆలోచించకుండా లక్షా ఎనభై వేలు మాత్రమే ఇంటి నిర్మాణానికి కేటాయిస్తుoడటం దారుణమన్నారు.
ఇంటి నిర్మాణ ఖర్చుకు ప్రభుత్వం మూడు లక్షలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. లేఅవుట్లలో తక్షణం నీటి సౌకర్యాన్ని కల్పించాలన్నారు. ఇంటి నిర్మాణ సామాగ్రిని ప్రభుత్వమే లేఔట్లలో అందుబాటులో ఉంచాలని, ఇసుక రవాణా ఖర్చులు ప్రభుత్వమే భరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు పగడపూల మల్లికార్జున, వడ్ల భాగ్యలక్ష్మి, హుస్సేన్, జి ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.