పక్క గృహాల రిజిస్ట్రేషన్లకు (OTS One Time Settlement) ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేదని గుంటూరుజిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు. పక్కా గృహాల రిజిస్ట్రేషన్లకు ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని, రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తుందని ఆయన అన్నారు. నరసరావుపేట మండలం యక్కలవారిపాలెంవారి, ఈ-టి కోటప్పకొండ గ్రామాలలో నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రలో డా౹౹చదలవాడ పాల్గొన్నారు.
గ్రామానికి విచ్చేసిన ఆయనకు గ్రామ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రజా చైతన్య యాత్రలో భాగంగా గ్రామాలలోని గడప గడపకు తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రిలా వ్యవహరించడం లేదని వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారని అన్నారు.
సంక్షేమ పథకాలు అందించకపోగా పన్నుల వసూళ్లా….?
గ్రామ స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన అందరికీ అందించకపోగా పన్నుల వసూళ్లు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. నిన్నటి వరకు కరోనా సంక్షోభం నుండి ఇప్పుడే కోలుకుంటున్న తరుణంలో ఒకపక్కన వర్షాలు వరదలతో ప్రజలందరూ ఆర్థికంగా నష్టపోయే చేతిలో రూపాయి లేకుండా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో వన్ టైం సెటిల్మెంట్ అంటూ గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వ హయాం నుంచి వివిధ ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన పక్కా గృహాలకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ లు అంటూ వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తున్నదని ఆయన అన్నారు.
ఒకపక్క గృహానికి పదివేల రూపాయలు నుండి 15 వేల రూపాయలు చెల్లించాలంటూ 4,800 కోట్ల రూపాయలు పేదల నుండి కొట్టేసే స్కెచ్ వేశారన్నారు. ఈ విధంగా సొమ్ములు వసూలు చేయడానికి టీములుగా ఏర్పడి అధికారులు, వాలంటీర్లు, వైసిపి నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి మీరు కట్టకపోతే మీకు వచ్చే స్కీములు అన్ని పోతాయని బెదిరించడం దారుణమన్నారు. మూడు సంవత్సరాల నుంచి అతీగతీ లేకుండా ఎక్కడైతే పని ఆగిందో అదేవిధంగా ఈ మూడు సంవత్సరాల నుంచి టిడ్కో గృహాలను పక్కన పెట్టిన విషయాన్ని ప్రజలు చూస్తున్నారన్నారు.
గత పాలకులు ఎవరూ ఇలాంటి తప్పుడు ఆలోచనలు చేయలేదు
చివరి దశలో ఉన్నటువంటి టిడ్కో గృహాలను అప్పగించడం లేదు గానీ 1983 సంవత్సరం నుంచి నందమూరి తారక రామారావు, నారా చంద్రబాబునాయుడు పేదవారికి అనేక స్థలాలు,గృహాలు ఇచ్చారు. ఇప్పుడు వాటి అన్నిటి మీద డబ్బులు వసూలు చేయడం అంటే ఎంత దారుణమో ఒక్కసారి ఆలోచించాలన్నారు. రాష్ట్రం విడిపోయిన ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఐదేళ్లలో నారా చంద్రబాబునాయుడు ఇటువంటి తప్పుడు ఆలోచన ఎప్పుడూ చేయలేదన్నారు.
ఈ వేళ ఈ రకంగా డబ్బులు వసూలు చేయడం అంటే ఇంతకన్నా నీచాతి నీచమైనటువంటి పని లేదన్నారు. నరసరావుపేట నియోజకవర్గ ప్రజలు ఎవరు ఈ OTS నిమిత్తం పది పైసలు కూడా కట్టనవసరం లేదన్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయమని వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్టర్ చేయించి పూర్తి బాధ్యత తాను తీసుకుంటానని డా౹౹చదలవాడ హామీ ఇచ్చారు.
ఈ ప్రజా చైతన్య యాత్రలో మేకల సైదారావు, జాగర్లమూడి హనుమంతరావు, చావపాటి సైదా వలి, పులిమి రామిరెడ్డి, సంజీవ రావు, పెరికల రాయప్ప,సుభాని,మాతంగి బంగారం,నాయుడు,వెంకట్రావు,శివ, గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.