అధికారంలో లేనప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన జగన్ ముఖ్యమంత్రి కాగానే మద్దతుగా మాట్లాడటం తీరని ద్రోహమని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర విభజనపై తనతో పాటు మరో 22 మంది సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది రాష్ట్ర విభజనకు తమకు అభ్యంతరం లేదని చెప్పారని ఉండవల్లి అన్నారు. బుధవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం తరఫు లాయర్ అభిషేక్ సింఘ్వీ ఈ విధంగా చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. ఇదంతా సీఎం జగన్ కు తెలిసే జరుగుతుందా? లేక తెలియకుండా జరుగుతుందా? అని ఉండవల్లి ప్రశ్నించారు. జగన్కు తెలిసే జరిగితే.. ఏపీకి జగన్ ద్రోహం చేసినట్టేనని అన్నారు. లగడపాటి రాజగోపాల్ పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే కొట్టినప్పుడు.. విభజనకు వ్యతిరేకమని.. విభజన జరగనివ్వమని జగన్ చెప్పిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తుచేశారు. పార్లమెంట్ బహిష్కరించిన 16 మందిలో జగన్ కూడా ఉన్నారని ఉండవల్లి పేర్కొన్నారు. ఎనిమిదేళ్లు గడిచినా ఏపీ విభజనపై కేంద్రం కౌంటర్ వేయలేదన్నారు. ఏపీ విభజన హామీలు ఇప్పటివరకు అమలు చేయలేదని, ఏపీ విభజన సరైనదా? కాదా? నిర్ణయించాలని సుప్రీంకోర్టును కోరుతున్నానన్నారు. తెలంగాణ, ఏపీని ఇప్పుడు కలపాలన్నది తన ఆలోచన కాదని… విభజనలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం తరపున జగన్ సుప్రీంకోర్టుకు తెలియజేయాలన్నారు. దీనిపై జగన్ మాట్లాడకపోతే ఆయనకు ఇక రాజకీయ భవిష్యత్ లేనట్టేనని ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు.
previous post