ఈ వానాకాలం పంట సేకరణకు ప్రభుత్వం సర్వం సిద్దంగా ఉందన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. నేడు కరీంనగర్లో మాట్లాడుతూ దాదాపు కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాల్సి ఉంటుందని దీనికి అవసరమైన నిధుల్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పౌరసరఫరాల సంస్థకు అందించారన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంట సేకరణ ప్రక్రియ కొనసాగుతుందని, దాదాపు 7100లకు పైగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో పాటు అవసరమైన చోట మరో వంద వరకూ ఏర్పాటు చేసుకోవడానికి కలెక్టర్లకు నిర్ధిష్ట ఆధేశాలు ఇచ్చామన్నారు మంత్రి గంగుల.
ఈ సారి పంట సేకరణకు 25 కోట్ల గన్నీబ్యాగులు అవసరమని ఇప్పటికే 14 కోట్ల గన్నీలను సేకరించామని, కొనుగోలు జరుగుతన్న తీరులో మిగతా గన్నీలు అందుబాటులోకి వస్తాయన్నారు. కొనుగోలు కేంద్రాలకు అవసరమైన మాయిశ్చర్ మిషన్లు, పాడీ క్లీనర్లు, టార్పాలిన్లు తదితర సమగ్ర సామాగ్రీ అందుబాటులో ఉందన్నారు. రాబోయే రెండున్నర నెల్ల పాటు ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని, ఎక్కడ ఎలాంటి అవసరమున్నా తక్షణం స్పందించే విదంగా యంత్రాంగాన్ని సిద్దం చేసామన్నారు. దీన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు.