పోలీస్ నియామకాలకు అడ్డదారులు ఉండవని అభ్యర్థులు నిబద్ధతతో కృషి చేస్తేనే ఉద్యోగాలు పొందుతారని పశ్చిమ మండలం డిసిపి జోయల్ డేవిస్ సూచించారు. యూసఫ్ గూడా లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో హైదరాబాద్ నగర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు వెయ్యి మంది అభ్యర్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని విధంగా భారీ పోలీస్ నియామకాలు చేపట్టనున్నదని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు గా సేవలు అందించాలని తాపత్రయపడుతున్న వారు క్రమశిక్షణతో నిబద్ధతతో వ్యవహరించాలని సూచించారు. పోలీస్ శాఖ లోనే ఉన్నత స్థానంలో ఉన్న డీజీపీ కార్యాలయంలో పనిచేసే వారికి సైతం అడ్డదారిలో పోస్టింగ్ ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు.
పోలీస్ శాఖలో ఉద్యోగాల పేరిట జరిగే మోసాల బారిన అభ్యర్థులు పడవద్దని సూచించారు. మూడు దశల్లో జరిగే పరీక్షలలో విజయం సాధించిన వారు మాత్రమే ఉద్యోగాలు పొందుతారని అన్నారు. ఒక్క ఏడాది పాటు ఇతర వ్యాపకాల ను పక్కన పెట్టి తాము అందిస్తున్న శిక్షణ తరగతులకు హాజరయితే భవిష్యత్తులో సంతోషకరమైన జీవితాన్ని అనుభవించవచ్చునని తెలిపారు. అగర పోలీస్ శాఖ అందిస్తున్న ఈ శిక్షణ తరగతులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.