రాజధాని ప్రాంతంలో చిమ్మ చీకట్లు రాజ్యమేలుతున్నాయి. అసలే అనుమాన మేఘాలు కమ్ముకుని ఉన్న రాజధాని ప్రాంతంలో ఇప్పుడు వీధి దీపాలు కూడా వెలగడం లేదు. ఈ పరిస్థితిని రాజధాని ప్రాంత ప్రజలు ఊహించను కూడా ఊహించలేదు. అయిదే అది ఇప్పుడు జరుగుతున్నది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి అత్యంత చేరువలో ఉన్న గ్రామాల రోడ్లు చీకటిలో మగ్గుతున్నాయి.
ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు నివాస మార్గంలో కూడా వీధి దీపాలు వెలగడం లేదు. నిత్యం ఎంతోమంది మహిళలు, పెద్దలు, యువత వాకింగ్ ఆహ్లదకర వాతావరణం ఉన్న ప్రాంతం ఈ విధంగా చీకటిగా మారడం ఇబ్బందులకు మార్గం అయింది. పంట పొలాల నడుమ కాలుష్య రహిత వాతావరణంలో వాకింగ్ చేసుకునేందుకు వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పంట పొలాలు కావటంతో విష పురుగులు సంచరిస్తూ ఉంటాయని చీకట్లో ఏమి కనిపించటం లేదని, దీనితో భయపడుతూ ప్రయాణించాల్సి వస్తుందని రైతులు, వ్యవసాయ కూలీకి వెళ్లే మహిళలు,వాకింగ్ కి వచ్చే వారు వ్యాఖ్యానిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు ఎవరూ స్పందించడం లేదని వాపోతున్నారు. పెనుమాక, ఉండవల్లి గ్రామాలలో రోడ్లపై రాజ్యమేలుతున్న ఈ చీకటి ఎప్పటికి దూరం అవుతుందో?