విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయడానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభించడం దుర్మార్గమని కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం 32 మంది బలిదానాలతో, సుమారు 33 వేల ఎకరాలలో,30 వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ లక్షలాది కుటుంబాలు విశాఖ ఉక్కు కర్మాగారం పై ఆధారపడి జీవిస్తున్నారని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత బిజేపి ప్రభుత్వం ఏపీ కి ప్రత్యేక హోదా, కొత్త పరిశ్రమలు ఇవ్వకపోగా 1971 లో కాంగ్రెస్ హయాంలో ఇందిరాగాంధీ పునాది రాయి వేసి ప్రారంభించిన విశాఖ ఉక్కు పరిశ్రమను “తూకం” వేసి అమ్మే కుట్రను ఢిల్లీలోని రాష్ట్ర ఎంపీలు,రాజ్యసభ సభ్యులు బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన అన్నారు.
ఢిల్లీలోని ఏపీ పార్లమెంటు,రాజ్యసభ సభ్యులు సొంత వ్యాపారాలపై చూపే శ్రద్ధ విశాఖ ఉక్కు అమ్మకం ప్రక్రియ నిలపడంలో ఎందుకు చూపడం లేదని నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. మన ఢిల్లీ ఎంపీ లకు “ఆంధ్రుల ఆర్తనాదాలు,కార్మికుల నినాదాలు” వినపడటం లేదా? అని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ వైఖరికి నిరసనగా ఏపీ లోని పార్లమెంటు సభ్యులంతా పార్టీలకు అతీతంగా ప్రధాని ఇంటిముందు శాంతియుత మౌన దీక్ష చేయాలి, అవసరమైతే విశాఖ ఉక్కు కోసం మీ పదవులకు రాజీనామాలు చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లోని బిజెపి నాయకులు “ఉత్తర కుమారుని” ప్రగల్భాలు పలుకుతూ కేంద్ర పదవుల కోసం”గుంట నక్కల్కా” కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఆయన తెలిపారు.