కార్మిక ఉద్యమ నాయకురాలు నౌదీప్ కౌర్ కు పంజాబ్ హర్యానా హైకోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది. తన పట్ల పోలీసులు కుట్ర పూరితంగా వ్యవహరించారని అందువల్ల తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె న్యాయస్థానాన్ని కోరారు.
ఆమెను అన్యాయంగా కేసులో ఇరికించారని ఎంతో మంది న్యాయస్థానానికి ఈ మెయిల్ ద్వారా సందేశాలు పంపారు. ఆమె వాదన, వచ్చిన ఈ మెయిళ్లను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.
పంజాబ్ షెడ్యూల్డ్ కులాల కమిషనర్ నౌదీప్ కౌర్ అరెస్టును తనంత తానుగా విచారణకు స్వీకరించి దర్యాప్తు చేస్తున్నది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటానికి విశేషంగా రైతులు మద్దతు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే తను తప్పుడు కేసుల్లో ఇరికించారని ఆమె ఆరోపించారు.
ఆమె సోనిపట్ జిల్లాలో మజ్దూర్ అధికార్ సంఘటన్ తరపున వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులను కూడగడుతున్నారు. రైతులకు మద్దతుగా కార్మికులు కూడా కదలిరావడం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇరకాటంలోకి నెట్టిందని అందుకే తనను నిలువరించేందుకు పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరించారని ఆమె న్యాయస్థానానికి తెలిపారు.